సంప్రదాయ నీటిపారకంతో పోల్చితే బిందుసేద్యం (డ్రిప్) ద్వారా పంటలసాగు ప్రయోజనకరమని, రైతుకు రెట్టింపు ఆదాయం సమకూరుతుందని నాబ్కాన్స్ సంస్థ స్పష్టంచేసింది. తెలంగాణలో బిందుసేద్యంతో రైతులు ఏటావివిధ రూపాల్లో రూ.9,549 కోట్లు ఆదాచేస్తున్నట్టు తెలిపింది. నాబ్కాన్స్ రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల మంది రైతులు 3.75 లక్షల ఎకరాల్లో బిందుసేద్యం ద్వారా పంటలసాగుపై సర్వే నిర్వహించింది. నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి అందజేసింది. 2016-17 నుంచి 2018-19 వరకు నాబార్డ్ అందించిన రూ.874 కోట్ల ఆర్థికసాయంతో 1.38 లక్షల మంది రైతులకు బిందుసేద్యం పరికరాలను సరఫరాచేశారు. తద్వారా 3.75 లక్షల ఎకరాల్లో బిందు సేద్యంచేశారు. రాష్ట్రంలో భారీమొత్తంలో బిందుసేద్యం పెరుగాల్సిన అవసరం ఉన్నదని నాబ్కాన్స్ నివేదికలో పేర్కొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 24 లక్షల బోర్ల కింద 50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.
ఇప్పటివరకు 18 లక్షల ఎకరాల్లో బిందు సేద్యం కిందికి మార్చారు. ప్రస్తుతం 3 లక్షల ఎకరాల్లో బిందు సేద్యం కోసం రైతులు దరఖాస్తు చేసుకొన్నారు. బిందు సేద్యం పరికరాలను ఒకసారి తీసుకొంటే ఏడేండ్ల వరకు ఉపయోగించుకోవచ్చని నాబ్కాన్స్ పేర్కొన్నది. తద్వారా ఏడేండ్లలో రైతులకు రూ.45 వేల కోట్ల ఆదాయం వస్తుంది. 33 శాతం విద్యుత్, 44 శాతం నీళ్లు ఆదా అవుతాయి. దీంతోపాటు 50 శాతం అధిక దిగుబడి రావడంతో 54శాతం అదనపు ఆదాయం సమకూరుతుంది.
ఆదా ఇలా..
——————————-
25.54 టీఎంసీల నీటిని ఆదాచేయడం ద్వారా రూ.7,235 కోట్లు మిగులుతాయి.
1703.78 లక్షల యూనిట్ల విద్యుత్ను ఆదాచేయడం ద్వారా రూ.76.67 కోట్లు ఆదా.
ఉత్పత్తి పెరుగడంతో అదనంగా 2,143.7 కోట్ల ఆదాయం.
కూలీల ఖర్చులో రూ.94 కోట్లు ఆదాయ అయ్యాయి.
సాగునీరు ఆదా ఇలా..
——————————-
1,48,194 హెక్టార్లలో సాధారణ నీటిపారకం, డ్రిప్ విధానంలో ప్రాజెక్టు చేపట్టారు. సాధారణ పద్ధతితో పోల్చితే డ్రిప్తో 43.8 శాతం నీరు ఆదా చేసినట్టు నివేదిక పేర్కొన్నది. 25.54 టీఎంసీల నీరు ఆదా అయ్యింది. లీటర్కు రూ.0.1 పైసల చొప్పున లెక్కిస్తే రూ.7,235 కోట్లు ఆదా అయ్యాయి.