ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించిందని, రాష్ట్ర విభజన అనంతరం అనూహ్యమైన అభివృద్ధి సాధించిందని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) జనరల్ మేనేజర్ అశ్వినీకుమార్గుప్తా చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాచేపట్టి, పూర్తిచేసిన నీటిపారుదల ప్రాజెక్టుల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే దేశంలో ఆహారధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్ర్టాల్లో పంజాబ్, హర్యానా తర్వాత తెలంగాణ నిలిచిందని తెలిపారు. కేరళ, కర్ణాటకలతోపాటు పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ర్టాలకు కూడా ఇక్కడి నుంచే బాయిల్డ్రైస్ ఎగుమతి అవుతుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’తో పలు విషయాలపై వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
దిగుబడి ఊహించలేనిది
ఉమ్మడి రాష్ట్రంలోఎంత పంట దిగుబడి వచ్చేదో ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే అంతకుమించి వస్తున్నది. ఈ యాసంగి సీజన్ ఆల్టైం రికార్డు ఉత్పత్తి 50 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. ఇది గతంతో పోలిస్తే వందశాతం అధిక ఉత్పత్తి. ఆ మేరకు బియ్యం కొనుగోలుకు ఎఫ్సీఐ ఏర్పాట్లుచేస్తున్నది. తెలంగాణ ప్రజల అవసరాలకు సరిపోను (సివిల్సైప్లె కార్పొరేషన్ కొన్న తర్వాత) మిగిలిన వాటిని ఎఫ్సీఐ కొనుగోలు చేస్తుంది. వాస్తవానికి ఇంత పెద్ద ఎత్తున ధాన్యం రావడం, ఎఫ్సీఐ దాన్ని బాయిల్డ్రైస్గా అమ్మడం మాకు ఓ పెద్ద సవాల్. మా సంస్థ అంచనాలకు కూడా అందనిది. అయితే, సీఎం కేసీఆర్ తరచూ చెప్పడంతో కొంత వరకు ప్రిపేరై ఉన్నాం.
ప్రొడక్షన్ గ్రోత్ ఎక్కువే
ధాన్యం ఉత్పత్తిలో దేశంలోని మరే రాష్ట్రంలో కూడా ఇంత ప్రొడక్షన్ గ్రోత్ నమోదుకాలేదు. వంద శాతానికిపైగా ఉత్పత్తి పెరిగింది. గత వానకాలం సీజన్లోనే గ్రోత్ స్పష్టంగా కనిపించింది. యాసంగికి వచ్చేసరికి గ్రోత్రేట్ వంద శాతానికిపైగానే ఉన్నది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ర్టాలకు ఇప్పటికే నాలుగు లక్షల టన్నుల బియ్యాన్ని పంపించాం. లాక్డౌన్ మొదలయ్యాక 2.80 లక్షల టన్నుల ధాన్యం సరఫరా చేశాం. ఇది ఒక రికార్డు. తాజాగా పశ్చిమ బెంగాల్ నుంచి 2.25 లక్షల టన్నుల ధాన్యం కావాలని అడిగారు. వాస్తవానికి ఛత్తీస్గఢ్, ఒడిశాల నుంచి బెంగాల్కు బియ్యం వెళ్తాయి. తొలిసారి తెలంగాణ నుంచి వెళ్లనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని ఎఫ్సీఐ వద్ద 15 లక్షల టన్నుల నిల్వలున్నాయి. యాసంగిలో మరో 50 లక్షల టన్నులు రానున్నాయి. ఇక్కడ ఉత్పత్తయ్యే ధాన్యంతో దక్షిణాది రాష్ర్టాలకు పూర్తిగా, బెంగాల్ వంటి రాష్ర్టాలకూ బియ్యం తాత్కాలికంగా సరఫరాచేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే దేశానికే తెలంగాణ అన్నం పెడుతున్నదంటే అతిశయోక్తి కాదేమో.
కనిపిస్తున్న ప్రాజెక్టుల ఫలితం
తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. దీని ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ స్థాయి ఉత్పత్తి మామూలు విషయం కాదు. గతంలో ఈ తరహా పంట పంజాబ్లో కనిపించేది. ఇప్పుడు తెలంగాణలో 50 లక్షల టన్నులు రానున్నాయి. వచ్చే యాసంగికి ఇది మరింత పెరుగడం ఖాయం. లాక్డౌన్లో కూడా ఎఫ్సీఐకి చెందిన వెయ్యిమంది ఉద్యోగులు, రెండు వేలమంది హమాలీలు అద్భుతంగా పనిచేస్తున్నారు. రోజుకు 11 గూడ్స్ రేక్లు నింపుతున్నారు. కర్ణాటకకు ఏడురేక్ల చొప్పున బియ్యం పంపిం చాం. ఇప్పుడు బెంగాల్కు పంపించే పని మొదలుపెడుతున్నాం.
అన్నదానానికి బియ్యమిస్తాం..
పేదలకు బియ్యం పంపిణీ చేయాలనుకొనే స్వచ్ఛంద సంస్థగానీ, చారిటీ ట్రస్టుగానీ తమను సంప్రదిస్తే వారికి కిలో రూ.22 చొప్పున ఇస్తాం. ఎంత బియ్యం కావాలంటే అంత ఇస్తాం. అయితే, పది క్వింటాళ్ల బియ్యం కన్నా ఎక్కువ తీసుకోవాలి. ఎఫ్సీఐ కార్యాలయాల్లో సంప్రదిస్తే వెంటనే బియ్యం మంజూరు చేస్తాం.