తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. లాక్డౌన్ రూల్స్ను కఠినంగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ పిలుపునిచ్చారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆటోలను, క్యాబ్లను, ప్రయివేటు వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు.
లాక్డౌన్ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్డౌన్ను అమలు చేయడం వల్ల కరోనాను నియంత్రించొచ్చు అని డీజీపీ తెలిపారు. నియమాలు, చట్టాలు కఠినంగా అమలు చేసిన నగరాల్లో కరోనా నియంత్రణలో ఉందని స్పష్టం చేశారు. ఏ వ్యక్తి బయటకు రావాలన్నా జీవో ప్రకారం నడుచుకోవాలి. ప్రతి చోట పోలీసు చెకింగ్ ఉంటుందని డీజీపీ తేల్చిచెప్పారు.
వాహనాలపై దూర ప్రాంతాలకు అనుమతించమని పేర్కొన్నారు.కిరాణా షాపులు, కూరగాయాల దుకాణాలకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని తెలిపారు. సాయంత్రం 7 గంటల వరకు కిరాణా, కూరగాయల దుకాణాలు, పెట్రోల్ బంక్లకు అనుమతి ఉంటుంది. సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటలకు వీటిని తెరవడానికి వీల్లేదు అని డీజీపీ స్పష్టం చేశారు. మన భవిష్యత్ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని డీజీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.