కరోనాతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. ఆయా దేశాల్లో కరోనా విజృంభణతో ప్రపంచ ఆర్థికవృద్ధి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 1451 పాయింట్లు, నిఫ్టి 430 పాయింట్లకు పైగా కుప్ప కూలింది. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 1710 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 498 పాయింట్ల నష్టంతో ముగిసింది. తద్వారా సెన్సెక్స్ 30 వేలు, చివరికి 29 వేల పాయింట్ల స్థాయి కోల్పోయింది. నిఫ్టీ 8500 పాయింట్ల దిగువన నిఫ్టీ కనిష్ట స్థాయికి చేరుకుంది. బ్యాంకింగ్ రంగ నష్టాలతో నిఫ్టీ 2017 తరువాత తొలిసారి 21వేలస్థాయికి క్షీణించింది. అయితే ఆర్బీఐ బాండ్ల కొనుగోలు ప్రకటనతో ఆఖరి పది నిమిషాల్లో ఊహించని విధంగా కీలక సూచీలు కోలుకోవడం గమనార్హం. హెచ్ డిఎఫ్ సి ట్విన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ (నాలుగేళ్ల కనిష్టం) టాటా మోటార్స్ 11 ఏళ్ల కనిష్టం, ఐసీఐసీఐ బ్యాంక్ , సింధు ఇండ్ బ్యాంక్, వోడాఫోన్ ఐడియా, బంధన్ బ్యాంకు సెన్సెక్స్ లో భారీగా నష్ట పోయాయి. భారతి ఇన్ ఫ్రాటెల్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బజాజ్ ఫిన సర్వ్, జెఎస్ డబ్ల్యు స్టీల్, హీరో మోటోకార్ప్, భారత్ పెట్రోలియం కూడా 6-17 శాతం క్షీణించాయి. మరోవైపు జీ ఎంటర్ టైన్మెంట్, ఐటీసీ,ఎస్ఎండీసీ, ఓఎన్జేసీ, యబ్యాంకు, టీసీఎస్ లాభపడ్డాయి.
కరోనా ధాటికి షేర్లు, కరెన్సీ కకావికలమవుతుంటే బంగారం ధరలు సైతం దిగివస్తున్నాయి. మహమ్మారి విజృంభణతో కొనుగోళ్లు పడిపోయిన క్రమంలో పసిడి ధర పతనమైంది. డెడ్లీ వైరస్ విస్తృత వ్యాప్తితో ప్రజలు నగదు నిల్వల వైపు మొగ్గుచూపడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనమవడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసిఎ లో బుధవారం పదిగ్రాముల బంగారం 534 తగ్గి రూ 39,710 పలికింది. ఇక కిలో వెండి రూ 534 పతనమై రూ 34,882కు పడిపోయింది. కరోనా కలకలంతో కేంద్ర బ్యాంకు ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 మహమ్మారి విజృంభణతో ప్రపంచ ఆర్థిక వృద్ధి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా ఈ పరిస్థితిని ఎదుర్కోవ డానికి చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి, రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య టేనతో మొత్తం రూ.10,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలును మార్చి 20న ప్రారంభిస్తామని ఆర్బిఐ తెలిపింది. అన్ని మార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడటం చాలా ముఖ్యమని ఆర్ బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్ బీఐ బాండ్ కొనుగోలు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే బెంచ్ మార్క్ పదేళ్ల బాండ్ దిగుబడి 6.24 శాతానికి పడిపోయింది. మరోవైపు తాజా నిర్ణయంతో ఆర్బీఐ 125 పాయింట్లమేర కీలక వడ్డీరేట్ల కోత పెట్టనుందన్న అంచనాలకు మరింత బలాన్నిస్తోంది. కాగా కోవిడ్ -19 రోజు రోజుకు విస్తరిస్తూ ప్రపంచ దేశాల్లో కల్లోలకం సృష్టిస్తోంది. ఈనేపథ్యంలో ఆయా సెంట్రల్ బ్యాంకులన్నీ రేట్ల కోతకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా యూఎస్ ఫెడ్ భారీగా రికార్డు స్థాయిలో రేట్ల కోతకు నిర్ణయించింది.