రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసే సరికి అధికార వైసీపీ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో 652 జెడ్పీటీసీ స్థానాలకు గాను 125 స్థానాలను ఆ పార్టీ ఏకగ్రీవంగా కైవశం చేసుకుంది. శనివారం రాత్రి 12 గంటల సమయానికి జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అందిన ప్రాథమిక సమాచారం మేరకు 9,696 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 2000 స్థానాలకు పైగా ఏకగ్రీవం అయ్యాయి. మండలానికి ఒక జెడ్పీటీసీ స్థానం ఉంటుంది. ఈ లెక్కన 125 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం అరుదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతల ఆగడాల పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకత, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం 9 నెలల జనరంజక పాలన పట్ల గ్రామీణ ప్రజలు చూపిస్తున్న ఆదరణతోనే స్థానిక టీడీపీ నేతలు పలుచోట్ల పోటీకి దూరంగా ఉన్నారనేది స్పష్టమైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. దీంతో ఆయా స్థానాల్లో ఎంత మంది పోటీలో ఉన్నారన్న వివరాలతో జిల్లాలో ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులు జాబితాలు విడుదల చేశారు. ఒక్కో అభ్యర్థే పోటీలో ఉన్న చోట ఎన్నిక ఏకగ్రీవం ఎన్నికయినట్లు రిటర్నింగ్ అధికారులు స్థానికంగా ప్రకటించారు. గత ఏడాది మే నెలలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9 నెలల కాలంలోనే ఎన్నికల ముందు చెప్పిన హామీలలో దాదాపు అన్నీ అమలు చేశారు. ఇందువల్ల ఈ ఎన్నికల్లో తాము పోటీ చేసినా గెలవమేమోనన్న భయం స్థానిక టీడీపీ నాయకులను వెంటాడటం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పది జిల్లాల్లో జెడ్పీటీసీలు ఏకగ్రీవం
– శ్రీకాకుళం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన 10 జిల్లాలోనూ జెడ్పీటీసీ స్థానాల్లో ఏకగ్రీవ విజయాలు నమోదయ్యాయి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడపలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలకు గాను 38 స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
– ఏకగ్రీవమైన జెడ్పీటీసీ స్థానాల సంఖ్యతో అధికార వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ పదవిని సునాయసంగా దక్కించుకోగలదు.
– చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీలకు గాను, 29 స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది.
– నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో రెండంకెల జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2000కు పైగా ఎంపీటీసీ స్థానాలను అధికార వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది.