రామప్పని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు వీలుగా, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ని మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అభ్యర్థించారు. ఇందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దేవాలయాలు, వారసత్వ కట్టడాల సంరక్షణకు సిద్ధంగా ఉందన్నారు. కాగా, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత గౌరవ సిఎం కెసిఆర్ గారు, తెలంగాణ అధ్యాత్మిక అస్తిత్వానికి పునరుజ్జీవం పోస్తున్నారన్నారు. పుణ్యక్షేత్రాలకు పూర్వ వైభవం తెస్తున్నారు. ఇదే వరసలో అతి పురాతన చారిత్రక, పర్యాటక క్షేత్రం రామప్ప ఉండాల్సింది. చెక్కు చెదరని శిల్పకళా వైశిష్ట్యం గల రామప్ప వారసత్వ సంపదగా ప్రపంచ గుర్తింపు కోసం చూస్తున్నదని అన్నారు. అలాగే రామప్ప చెరువు మధ్యలో ఉన్న ఐ ల్యాండ్ లో ఓ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేద్దామని గౌరవ సీఎం కెసిఆర్ గారు మూడేళ్ళ క్రితమే ఓ హామీ ఇచ్చారన్నారు. సిఎం గారి హామీ మేరకు ఐ ల్యాండ్ లో కొన్ని పిల్లర్లు వేసి నిర్మాణం మొదలు పెట్టి వదిలి పెట్టారన్నారు. అసలు అక్కడ ధ్యాన కేంద్రం కట్టే యోచన ఉందా? లేక శిల్పకళా వేదిక, శిల్పకళాశాల లాంటిదేదైనా పెడితే బాగుంటుందా? అన్న దిశగా ప్రభుత్వం ఆలోచించాలని కోరారు.
అలాగే రామప్ప పురావస్తు శాఖ పరిధిలోకి తెచ్చారని, పురావస్తుశాఖ కేంద్ర పరిధిలో ఉందని, దీంతో ఆలయ పురావైభవాన్ని కాపాడేందుకే పురావస్తుశాఖ అపసోపాలు పడుతున్నదన్నారు. అద్భుత ఆ శిల్పకళని చూడ్డానికి వేలాదిగా ప్రజలు దేశ సరిహద్దులు దాటి వస్తున్నారు. ఆలయ అభివృద్ధి ఇంకా జరగాల్సి వుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కొన్ని నిధులు తెచ్చి రామప్పని అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ మంత్రి దృష్టికి తెచ్చారు. రామప్పని మంచి టూరిజం స్పాట్ గా మార్చే అవకాశం ఉంది. రామప్ప ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. యునెస్కో ప్రతినిధుల బృందం రామప్పని విజిట్ చేసింది. యునెస్కోకి గౌరవ సీఎం గారి ఆశీస్సులు, మంత్రి కెటిఆర్ గారల సహకారంతో తాను చొరవ తీసుకుని యునెస్కో బృందంతో మాట్లాడానన్నారు. అక్కడ కొంత అభివృద్ధిని చేస్తే, యునెస్కో అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. యునెస్కో గుర్తింపు వస్తే, మరిన్ని నిధులు వస్తాయి. దీంతో రామప్ప అంతర్జాతీయ టూరిజం స్పాట్ గా మారే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుంది. అనేక మందికి ఉపాధి కూడా లభిస్తుందని ఎమ్మెల్సీ పోచంపల్లి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తెచ్చారు.
రామప్పని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు వీలుగా, కేంద్ర ప్రభుత్వంతోనూ రామప్ప అభివృద్ధిపై మాట్లాడాలని మంత్రిని, ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సర్వే ఆఫ్ ఇండియా, పురాతత్వశాఖ, సాంస్కృతిక, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో మరిన్ని నిధులతో మరింతగా ఆధునీకరించడానికి వీలుందని చెప్పారు. ఇందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ, పురాతన ఆలయాలు, కట్టడాలకు పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తున్నదన్నారు. సిఎం కెసిఆర్ గారు ఈ అంశాలపై కూలంకశంగా చర్చిస్తున్నారన్నారు. అయితే, పురావస్తుశాఖ పరిధిలో ఉన్నందున దీనిపై సిఎంగారితో చర్చించి అభివృద్ధికి తగు ఆలోచనలుచేస్తామని హామీ ఇచ్చారు.