దేశ రక్షణలో తెలుగు బిడ్డ మరోసారి తన పౌరుషాన్ని చాటాడు..కరడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదిని అంతం చేసి ఉద్దానం సైనికుడు తన వీరత్వాన్నిచాటుకున్నాడు. దేశం కోసం ప్రాణాలు తెగించి శత్రువులను మట్టుబెట్టి శభాష్ అనిపించుకున్నాడు. తామాడ దొరబాబు అనే ఉద్దానం సైనికుడిపై ఇప్పుడు ఆర్మీ అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మందస మండలం చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన జవాను తామాడ దొరబాబు తొమ్మిదేళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నారు. మార్చి 10న సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో దొరబాబు పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చడంలో కీలక పాత్ర పోషించారు.
దొరబాబు జమ్మూ–కాశ్మీర్లోని 1ఆర్ఆర్ బెటాలియన్లో దొరబాబు పని చేస్తున్నాడు. కాగా తాజాగా 200 మంది జవాన్లు సెర్చ్టీంగా కోజ్పూర్ గ్రామంలో సెర్చ్ చేస్తున్నారు. రెండిళ్లు సెర్చ్ చేసిన అనంతరం హఠాత్తుగా ఓ ఇంటి నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో సైనికులు తేరుకునే లోపే దొరబాబు కాలికి గాయమయ్యింది. అయినా దొరబాబు వెనుకడుగు వేయక శత్రువు గమ్యాన్ని నిశితంగా అబ్జర్వ్ చేశాడు. కిటికీ నుంచి ఇద్దరు ముష్కరులు కనిపిస్తుండడంతో తన దగ్గరనున్న ఏకే–47తో దొరబాబు ముందుకు ఉరికి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. 30 రౌండ్ల మేగజైన్లోని 27 రౌండ్లు శత్రువులో దిగిపోయాయి. దీంతో పాకిస్తాన్ టెర్రరిస్టు సాభిర్ అహ్మాలిక్ అక్కడికక్కడే మరణించాడు. మరో ఉగ్రవాది కూడా దొరబాబు కాల్చిన బులెట్లతో పాటు పక్కనే ఉన్న సైనికులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. కాలికి బుల్లెట్ దెబ్బతగిలినా లెక్క చేయక..అత్యంత ధైర్య సాహసాలతో శత్రువులకు ముందుకు ఉరికి కాల్పులు జరిపి మట్టుబెట్టిన వైనం ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంది.
దొరబాబు వీరత్వంపై ఆర్మీ అధికారులు ప్రశంసలు కురిపిచారు. ఇక దేశ రక్షణలో ప్రాణాలను సైతం లెక్కచేయక శత్రువులను అంతంమొందించి దొరబాబు ఉద్దానం ఖ్యాతిని మరింత పెంచారని ఉద్దానంవాసులు అంటున్నారు. కాగా ఉద్దాన ప్రాంతమైన లొహరిబంద పంచాయతీ చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన తామాడ భైరాగి, కామమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆనందరావు(ఢిల్లీ), దొరబాబు(జమ్మూ–కాశ్మీర్) ఇద్దరూ ఆర్మీలోనే పని చేయడం గమనార్హం. తమ కుమారులిద్దరూ సైన్యంలో పని చేయడం గర్వంగా ఉందని, దొరబాబు ముష్కరులను హతమార్చి మాతృభూమి రక్షణలో కీలకపాత్ర పోషించడంపై అతడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్లో దొరబాబు స్వల్ఫంగా గాయపడ్డాడు. కాలిలో బులెట్ తగిలి స్వల్ప గాయమైందని, ప్రస్తుతం బాగానే ఉన్నానని దొరబాబు మీడియాతో చెప్పారు. మొత్తంగా దేశ రక్షణలో ఉద్దానం సైనికుడి వీరత్వంతో తెలుగు నేల గర్వంతో పులకించిపోతుంది.