ఏపీ రాష్ట్రంలో ఉగాది రోజున సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉగాది రోజున రాష్ట్రంలో సుమారు 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 43,141 ఎకరాల భూమిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసి.. మార్కింగ్, ప్లాట్లు వేసి సర్వం సిద్ధం చేసింది. గతంలో సర్కార్ పంపిణీ చేసే ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు కేవలం వారసత్వ అనుభవ హక్కు మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారులు ఇంటిని కట్టుకోవడానికి, బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకోవడానికి.. ఐదేళ్ల తర్వాత వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించుకోవడానికి వీలుగా ప్రభుత్వం న్యాయపరమైన హక్కులు కల్పిస్తోంది. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్లో స్టాంప్ పేపర్పై రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఎమ్మార్వోలకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల హోదా కల్పించాలని, ఎమ్మార్వో కార్యాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా గుర్తించాలని నిర్ణయించింది. ఏటా 6 లక్షలకుపైగా ఇళ్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్లు నిర్మించాలని.. వీటికి వైఎస్సార్ జగనన్న కాలనీలుగా పేరు పెట్టాలని తీర్మానం చేసింది. పై ఫోటోలో లబ్ధిదారులకు ఇచ్చే ఇంటి పట్టాను చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్
