ఒకరు ఐఏఎస్ అధికారి. సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి పెద్దలు ఓ డాక్టర్ ను వధువుగా నిశ్చయించారు. ఇద్దరూ విద్యావంతులే. కట్నకానుకల ప్రస్తావన వచ్చే సరికి సదరు అధికారి కోరిక విని ఆమెకు తొలుత ఆశ్చర్యం కలిగినా, వెంటనే తేరుకుని అంగీకరించింది. అంతటి ఆదర్శ భావాలున్న వ్యక్తి తనకు భర్తగా లభించడం అదృష్టమని అనుకుంటూ సంతోషంతో వివాహానికి అంగీకరించింది. ఆపై… వారి పెళ్లి ఘనంగా జరిగింది.తమిళనాడులోని తిరునెల్వేలి సబ్ కలెక్టర్ శివగురు ప్రభాకరన్… తన కాబోయే భార్య వారంలో రెండు రోజులు పేదలకు ఉచిత వైద్య సేవలందించాలని షరతు పెట్టారు. అదే తాను వరకట్నంగా కోరుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వైద్యురాలైన యువతి కోసం ఇంట్లో పెద్దలు వెతికి, చివరికి చెన్నైకి చెందిన ఓ గణిత అధ్యాపకుడి కుమార్తె డాక్టర్ కృష్ణభారతిని చూశారు. ప్రభాకరన్ కోరిక మేరకు ‘వినూత్న వరకట్నం’ అడిగారు. వారంలో రెండు రోజులు ప్రభాకరన్ స్వగ్రామమైన ఒట్టంకాడు, పరిసర గ్రామాల్లోని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నదే దాని సారాంశం. దీనికి వధువు ఇంటివారు సమ్మతించడంతో ఫిబ్రవరి 26న వారి పెళ్లి తమిళనాడులోని తంజావూరు జిల్లాలో జరిగింది. ప్రభాకరన్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ప్రభాకరన్ తొలుత రైల్వేలో ఉద్యోగం చేశారు. అనంతరం పట్టుదలతో ఐఏఎస్ చేశారు. ఆయన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ‘డాక్టర్ ఏపీజే గ్రామ అభివృద్ధి బృందం’ ఏర్పాటు చేసి పలు రకాల సేవలు అందిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, శ్రమదానం కింద చెరువుల పూడికతీత వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
