వైజాగ్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబును అడ్డుకున్న నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైజాగ్లో చంద్రబాబును అడ్డుకున్నది ఉత్తరాంధ్ర ప్రజలు కాదని…వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు ముఖ్యంగా పులివెందుల రౌడీలు అంటూ టీడీపీ ఆరోపిస్తుంటే…వైసీపీ అంతే ధీటుగా బదులిస్తోంది. తాజాగా టీడీపీ విమర్శలపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపించకపోతే.. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా’ అంటూ మంత్రి అవంతి సవాల్ విసిరారు. ఒక వేళ తన కాన్వాయ్ను అడ్డుకున్నది పులివెందుల నుంచి వచ్చిన వాళ్లే అని బాబు నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని మంత్రి అవంతి ప్రకటించారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు తన స్వార్థం కోసం, తన కుల ప్రయోజనాలకోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకి ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పించిందని.. పోలీసులపై చంద్రబాబు,లోకేష్ విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. పోలీసులు చట్టానికి లోబడే పనిచేస్తారని తెలిపారు. ఇళ్లకి వచ్చి దౌర్జన్యాలు చేస్తామని లోకేష్ చేసిన వ్యాఖ్యల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబును అడ్డుకున్నారని మంత్రి అవంతి వ్యాఖ్యానించారు. విశాఖలో పరిపాలన రాజధానికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతారో లేదో తేల్చి చెప్పాలని అన్నారు. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతికే మద్దతు తెలిపితే వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు… ఆయనపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు… మండు టెండలో ఆరు గంటల పాటు ప్రజలు ధర్నా చేశారు… పోలీసులు, మహిళలపై చంద్రబాబు తీరు దారుణంగా ఉంది… లోకేష్ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారంటూ అవంతి శ్రీనివాస్ తీవ్రంగా దుయ్యబట్టారు. మండలిలో ‘మూడు రాజధానుల బిల్లుల’ను టీడీపీ వ్యతిరేకించడంపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేశంగా ఉన్నారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని చంద్రబాబు అనుకున్నారని..కానీ ఇది ఉద్యమాలకు పుట్టినిల్లు అని అవంతి పేర్కొన్నారు. పులివెందుల రౌడీలు అంటూ టీడీపీ నేతలు కించపరుస్తూ మాట్లాడుతున్నారు..కాని అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారితో పోరాడి ప్రాణాలు అర్పించిన పోరాటాల గడ్డ విశాఖ అని మంత్రి స్పష్టం చేశారు. మొత్తంగా పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపించకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ మంత్రి అవంతి విసిరిన సవాల్ ఆసక్తికరంగా మారింది.