ఇరాక్ లో చిక్కుకున్న 16 మంది తెలంగాణ బిడ్డలను సొంత ప్రాంతానికి రప్పించేందుకు మంత్రి కే. తారకరామారావు చూపిన చొరవ ఫలించింది. ఇరాక్ లో చిక్కుకొని అనేక బాధలు పడుతున్నామని, నకిలీ ఏజెంట్ల మోసంతో ఆక్కడ చిక్కుకొని కనీసం తాగేందుకు నీరు, తినేందుకు తిండి, వసతి సౌకర్యాలు లేక సొంత ప్రాంతాలకు తిరిగి రాలేక నాలుగు సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తున్నామని మంత్రి శ్రీ కె.టి.రామారావు గారికి బాధితులు తెలిపారు.
వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ఎన్నారై శాఖ అధికారులకు సమాచారం అందించి, వారిని సొంత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందించాలని సూచించారు.
ఈ మేరకు ఇరాక్ లోని భారత రాయబార కార్యాలయం తో, భారత విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేసిన తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ శాఖ, అక్కడ ఇరాక్ లో చిక్కుకున్న వారికి విమాన టికెట్లు అందించి తెలంగాణకు రప్పించడానికి ఏర్పాట్లు చేసింది. అంతే కాకుండా వీరిపై ఉన్న కుర్దిస్తాన్ (Kurdistan Regional Government) ఓవర్ స్టే పేనాల్టి (Over Stay Penalty) సుమారు 2 కోట్ల రూపాయల మేర మినహాయింపుకు తెలంగాణ ఎన్.ఆర్.ఐ శాఖ కృషి చేసింది.
వీరిలో ఒకరు ముందే అనారోగ్యం పై ఫిబ్రవరి 3వ తేదిన భారత్ కు చేరారు. ఈ రోజు ఇరాక్ నుంచి బయలుదేరిన వీరంతా రేపు ఉదయం హైదరాబాద్ కి చేరుకుంటారు. వీరందరిని వారి వారి సొంత ప్రాంతాలకు పంపేందుకు అవసరమైన స్థానిక రవాణా సౌకర్యాలను కూడా తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ శాఖ సమకూర్చినది.
ఆపత్కాలంలో తమ బాధలకు స్పందించి వెంటనే సహాయం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్ కి వారంతా ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో వేగంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ శాఖ అధికారి చిట్టి బాబు ని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.