కాంగ్రెస్ పార్టీ ని చూస్తే జాలేస్తోంది.అత్యంత అవమానకరమైన రీతిలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. దేశ రాజధాని ఉన్న రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే వారు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. ఈ దేశాన్ని అత్యంత సుదీర్ఘకాలంపాటు తిరుగులేకుండా పరిపాలించిన పార్టీ ఇదేనా? అనే అనుమానం కలుగుతుంది.ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి.. అనే హోదా తో కొన్ని దశాబ్దాలుగా రాజకీయం నడుపుతున్న రాహుల్ నేతృత్వంలో, ఆ పార్టీ మరింత అచేతనత్వాన్ని సమకూర్చుకుంది. దాని ఫలితమే ఇప్పుడు ఇలా వరుస పరాజయాలు వారిని పలకరిస్తున్నాయి.ఎన్నికల్లో కనీసం శ్రద్ధగా ప్రచారం కూడా నిర్వహించకుండా ఉదాసీనంగా ఉండిపోయింది. చేతగానితనం కంటే అత్యంత ప్రమాదకరమైన లక్షణం ఉదాసీనత. ఎన్నికల్లో అభ్యర్థులను మోహరించడం గాని ప్రచారం చేయడంలో గాని కాంగ్రెస్ పార్టీకి ఏ దశలోనూ సీరియస్ నెస్ కనిపించలేదు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.
