ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం జరగనుంది.. అనంతరం సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 10 గంటలకే కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్లో కీలక ప్రతిపాదనలు చేయనున్నారు.. 1నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్ బ్యాగ్ ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మూడు జతల యూనిఫాంలు, రెండు జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనలు మంత్రివర్గం ముందుకు రానున్నాయి. ఎర్ర చందనం కేసుల విచారణకోసం తిరుపతిలో ప్రత్యేక కోర్టు.. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన ర్యాలీలపై నమోదైన కేసులను రద్దు చేయాలని చర్చించనున్నారు.
స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు ముసాయిదా బిల్లుపైనా చర్చించనుంది మంత్రివర్గం.. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను 27 రోజుల నుంచి 20 రోజులకు కుదించే ప్రతిపాదనతో పాటు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రివర్గం చర్చిస్తుంది. దీనిద్వార 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయాలన్న ప్రతిపాదనపైనా చర్చలు జరపనున్నారు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను మరోసారి ప్రధానితో చర్చించనున్నట్టు సమాచారం. ఈ భేటీలో రాజధాని అమరావతి అంశం సహా శాసన మండలి రద్దుపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల ఆవశ్యతను మోదీకి తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానితో భేటీ తర్వాత ఇవే అంశాలతో హోంమంత్రి అమిత్ షా తోనూ చర్చించే అవకాశాలు ఉన్నాయి. అనంతరం రాత్రి 7గంటలకు జగన్ ఢిల్లీ నుంచి తిరుగు పయనమవుతారు. రాత్రి 9.40 గంటలకి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.