అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్లో తీగ లాగితే బాబు బ్యాచ్ డొంక కదులుతోంది. కొద్దిరోజులుగా రాజధాని భూబాగోతంపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు తెల్లకార్డులదారులను అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి, మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు కోట్లాది రూపాయలు అక్రమంగా తరలించారని గుర్తించారు. టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్, మనీలాండరింగ్పై విచారణ జరుపమని ఈడీ, ఐటీ శాఖలను సీఐడీ కోరింది. ఈ క్రమంలో అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్పై సీఐడీ, ఈడీలు విచారణ జరుపుతున్నాయి.
తాజాగా అనంతపురం జిల్లా, ధర్మవరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రూ.400 కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వరదాపురం సూరి రాజధాని అమరావతిలో వస్తుందని ముందే తెలుసుకుని.. తన భార్య గోనుగుంట్ల నిర్మలమ్మ, కాంట్రాక్టు సంస్థ నితిన్సాయి కన్స్ట్రక్షన్స్ పేరుతో సీఆర్డీఏ పరిధిలోని వెలగపూడి సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఉండవల్లిలో 11.34 ఎకరాల భూమి కొనుగోలు చేశారని సీఐడీ గుర్తించింది. సర్వే నంబర్లు 144–2ఏ2, 144–2ఏ3, 149–బీ2, 149–బీ3, 151–2ఏ, 195–ఏ, 196–సీ1ఏ1ఏ, 199–3, 207–3, 207–5ఏలలో తన భార్య గోనుగుంట్ల నిర్మలమ్మ పేరుతో 5.67 ఎకరాలు, సర్వే నంబర్లు 140–1బీ, 180–1బీ1, 184–ఏ2/3, 196బీ3బీ, 200–ఏ1, 206–1ఏలలో 5.67 ఎకరాలు మొత్తం 11.34 ఎకరాల భూమిని సూరి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే రీతిలో సీఆర్డీఏ పరిధిలోని పలు మండలాల్లోనూ సూరి 56 ఎకరాలకు పైగా భూమిని కొన్నారని.. వీటి విలువ రూ. 400 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.
ఈ నేపథ్యంలో.. సూరి కుటుంబ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన సీఐడీ.. ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు, అలాగే మనీల్యాండరింగ్కు కూడా పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చింది. దీంతో తక్షణమే వరదాపురం సూరిపై చర్యలు తీసుకోవాలని ఐటీ, ఈడీలకు సీఐడీ నివేదిక అందజేసింది. ఈ క్రమంలో సూరి మనీలాండరింగ్ వ్యవహారంపై ఈడీ, ఐటీ శాఖలు సీఐడీకి సమాంతరంగా విచారణ చేపట్టనున్నాయి. కాగా వరదాపురం సూరి 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం తనను తాను రక్షించుకోవడానికి చంద్రబాబు ఆదేశాల మేరకు బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్లో ఈడీ విచారణతో కేసుల భయంతో టీడీపీ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు పార్టీలో జరుగుతుంది. ఇప్పుడు వరదాపురం సూరి కూడా కేసుల భయంతో అండర్ గ్రౌండ్కు వెళతారా..లేదా ఈడీ విచారణకు హాజరవుతారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్పై సీఐడీ, ఈడీ, ఐటీ శాఖలు దూకుడుగా విచారణ జరుపుతుండడంతో బాబు బ్యాచ్కు మున్ముందు దబిడి దిబిడే..అంటూ ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.