అమరావతిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్, మనీలాండరింగ్ వ్యవహారాలపై సీఐడీ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీమంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సదరు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. వారం రోజుల క్రితం వరకు కూడా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం చేసిన వాదనను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్తో సహా టీడీపీ నేతలంతా కొట్టిపారేశారు. అమరావతిలో అంతా చట్టప్రకారమే జరిగిందని…ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించడం లేదంటూ చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు అడ్డగోలుగా ఎదురుదాడి చేశారు. దీంతో ప్రభుత్వం తొలుత సీఐడీ విచారణకు ఆదేశించింది. చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ జరిపిన సీఐడీ అధికారులు 790 మందికి పైగా తెల్లకార్డుదారులతో … దాదాపు 761 ఎకరాల భూములను టీడీపీ నేతలు కొట్టేసినట్లు గుర్తించారు. అంతే కాదు టీడీపీ నేతలు అమరావతిలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలను మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. దీంతో తెల్లకార్డుల పేరుతో జరిగిన భూబాగోతంపై విచారణ చేయాల్సిందిగా సీఐడీ ఈడీని కోరింది. ఈ మేరకు రంగంలోకి దిగిన ఈడీ అధికారులు అమరావతి భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని తమ ప్రాథమిక విచారణలో నిర్థారించారు.
ఈ వ్యవహారంలో మాజీమంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలకు ఈడీ అధికారులు నోటీసులు అందజేయనున్నట్లు వచ్చిన సమాచారంతో వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది. అమరావతి ప్రాంతంలోని వెంకటపాలేనికి చెందిన ఒక దళిత మహిళ తన భూమిని మోసపూరితంగా కాజేశారని ఇచ్చిన ఫిర్యాదుతో వారిద్దరిపై ఛీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి పలు సెక్షన్లతో కేసులు నమోదవడంతో వారిద్దరూ మీడియా ముందుకే రావడంలేదని , అరెస్టు భయంతో వారు ముందస్తు బెయిల్కు ప్రయత్నిస్తున్నట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. నిన్న మొన్నటివరకు ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ జరిపినా తమకేం కాదని విర్రవీగిన టీడీపీ నేతలకు సీఐడీ దర్యాప్తుతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో వణుకు మొదలైంది.
నాలుగైదు రోజులుగా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్పై సీఐడీ, ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుండడంతో తమ నాయకుల చుట్టూ ఉచ్చు బిగుస్తుందని….రాజధానికి చెందిన టీడీపీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా తెల్లకార్డులదారులను బినామీలుగా పెట్టుకుని చేసిన భూబాగోతంపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుండడంతో ఏ రోజు ఎవరి పేరు వినాల్సివస్తుందో…ఎవరెవరిని ఈడీ విచారణకు పిలుస్తుందోనని టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఇక మాజీమంత్రులు, పత్తిపాటి పుల్లారావు, నారాయణలతో పాటు టీడీపీ పెద్దల దందాకు సహకరించిన స్థానిక నేతలు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అమరావతిలో పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై ఈడీ దూకుడుగా విచారణ చేస్తుండడంతో బాబు బ్యాచ్లో ఆందోళన మొదలైంది. మరి ఈడీ విచారణలో టీడీపీ పెద్దల బాగోతం బయటపడుతుందో లేదో చూడాలి.