ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..చంద్రబాబు స్పీకర్ను అడ్డుపెట్టుకుని నిబంధనలకు వ్యతిరేకంగా…వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ… మండలి చైర్మన్ షరీఫ్ మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి చేత తప్పుడు పని చేయించిన చంద్రబాబుని ప్రజలు క్షమించరన్నారు. ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకుంటున్న పరిస్థితుల్లో శాసనమండలి అవసరం లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. త్వరలోనే టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. టీడీపీ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేసిందని, మరికొందరు టీడీపీ పెద్దల బండారం కూడా బయటపడుతుందన్నారు.
ఇక వైసీపీ సర్వనాశనం అయిపోతుందంటూ శాపనార్థాలు పెడుతున్న పవన్ కల్యాణ్పై కూడా గ్రంథి శ్రీనివాస్ స్పందించారు. బీజేపీతో కలిసిన తర్వాత పవన్కల్యాణ్ మంచి జోష్ మీద ఉన్నారని.. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి హోదాలో ఉన్నట్లు.. మోదీ, అమిత్ షా స్థానంలో ఉన్నట్టు ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పడగొడతానని పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పవన్ పుస్తకాలు చదువుతున్నానంటారు..కానీ చట్టాలు కూడా చదవాలని గ్రంథి శ్రీనివాస్ హితవు పలికారు. మొత్తంగా వికేంద్రీకరణ బిల్లును మండలిలో టీడీపీ అడ్డుకోవడంతో చంద్రబాబు, పవన్ టార్గెట్గా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలతో ఏపీ రాజకీయాలు హాట్హాట్గా మారాయి.