రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అసెంబ్లీ వద్ద సీఎం వైఎస్ జగన్ను కలిసిన రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి ప్రాంత రైతన్నలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. గత సర్కారు హయాంలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించినప్పుడు ఇచ్చిన రాయితీలు, పరిహారం కంటే అధిక ప్రయోజనాలు కల్పిస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు అసెంబ్లీ వద్ద రాయలసీమ ప్రజాప్రతినిధులు కూడా సీఎం వైఎస్ జగన్ను కలిసి.. ఆయనతో కాసేపు ముచ్చటించారు. కాగా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి గురించి ఆలోచించి.. సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.
