న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ర్ట పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు బుధవారం న్యూజిలాండ్ పార్లమెంటరీ సభ్యురాలు ప్రియాంక రాధాక్రిష్టన్ ఈ రోజు మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసారు. భేటీ సందర్బంగా ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యారంగాల్లో కలసి పని చేసేందుకు ఉన్న అవకాశాలపైన ఇరువురు చర్చించారు. తెలంగాణతో అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపైన చర్చించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ర్టం స్టార్ట్ అప్, ఇన్నోవేషన్ రంగంలో దేశంలోనే ముందువరుసలో ఉన్నదని, టిహబ్, విహబ్ వంటి ఇంక్యూబేటర్ల ద్వారా తెలంగాణ ఈ రంగంలో ముందున్నామన్నారు. దీంతో పాటు త్వరలోనే టీహబ్ రెండో దశ ప్రారంభం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వీదేశీ స్టార్ట్ అప్ ఇకో సిస్టంతో కలిసి పనిచేసేందకు ఉద్దేశ్యించిన టి- బ్రిడ్జ్ కార్యక్రమాన్ని బలోపేతం చేయనున్న వెల్లడించారు. టి బ్రిడ్జ్ కార్యక్రమంలో భాగంగా న్యూజిలాండ్ స్టార్ట్ అప్స్ తోనూ కలిసి పనిచేసేందుకు కృషి చేయాలన్నారు. దీంతో పాటు అగ్రిటెక్ రంగంలోనూ అనేక అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా పెద్ద ఏత్తున అందుబాటులోకి వస్తున్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగంలో, పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఇప్పటికే ఇక్రిసాట్ తో అగ్రిటెక్ రంగంలో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. భేటీ సందర్భంగా న్యూజిలాండ్ లో పర్యటించాల్సిందిగా ప్రియాంక.. కేటీఆర్ ను ఆహ్వానించారు. స్థానిక వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె తెలిపారు. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటియార్ తో జరిగిన సమావేశం పట్ల ప్రియాంక హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏన్నారైలతో న్యూజిలాండ్ లో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏన్నారై టీఆర్ఎస్ కో అర్డినేటర్ మహేశ్ బిగాల పాల్గొన్నారు.