రాష్ట్రంలో మత్య్యకారులకు పది రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చింది.. పాక్ చెరలో చిక్కుకున్న 20 మంది మత్స్యకారుల కోసం 13 నెలలుగా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న యావత్ మత్స్యకారులందరి కళ్లలో ఈరోజు కొత్త కాంతి కనిపిస్తోంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ప్రత్యేక చొరవతో.. పాకిస్తాన్ బంధించిన మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.. మంత్రి మోపిదేవి స్వయంగా వాఘా సరిహద్దుకు వెళ్లి వారిని స్వేచ్ఛా ప్రపంచంలోకి తీసుకు రావడం మత్స్యకారుల పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, చిత్తశుద్ధికి అద్దం పట్టింది. సోమవారం భారత–పాక్ సరిహద్దు వద్ద పాక్ అధికారులు వారి చెరలో ఉన్న మత్స్యకారులను అధికారులతో కూడిన మంత్రి మోపిదేవి బృందానికి అప్పగించారు.
