తెలంగాణలో దిశా ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా జీరో ఎఫ్ఐఆర్ ప్రాధాన్యంపై చర్చ జరుగుతోంది. పరిధితో సంబంధం లేకుండా ఫిర్యాదు స్వీకరించి నమోదు చేసుకునే విధానమే జీరో ఎఫ్ఐఆర్. ఈ తరహాలో ఆంధ్రప్రదేశ్ లో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. తన కుమారుడ్ని కిడ్నాప్ చేశారంటూ కృష్ణా జిల్లా వీరులపాడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన రవినాయక్ అనే వ్యక్తి కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పరిధి వెలుపలి వ్యవహారం అయినా కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకోవడమే కాకుండా, బాలుడు తెలంగాణలో ఉన్నట్టు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. విచారణలో భాగంగా రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు తీవ్రంగా శ్రమించి బాలుడు మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. మొత్తానికి ఏపీలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, తొలి కేసును పోలీసులు ఎంతో బాధ్యతగా చేపట్టి విజయాన్ని సాధించారు.
