ఏపీలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఇసుక రవాణాలో అవినీతిని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు 14500 టోల్ ఫ్రీ నంబరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి అక్కడ పనిచేస్తున్న అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ ఉద్యోగులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్, టాస్క్ఫోర్స్ చీఫ్ సురేంద్ర బాబు తదితరులు హాజరయ్యారు.ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి, ఇసుక మాఫియాను అంతం చేసేందుకు సీఎం జగన్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డా, అధిక ధరలకు విక్రయించినా, పరిమితికి మించి కలిగి ఉన్నా నిందితులకు 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా రూ. 2 లక్షల వరకు జరిమానా విధించేలా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.