ఔను నిజమే. హైదరాబాద్లో సెల్ఫీ దిగితే..పోలీసులు వార్నింగ్ ఇస్తారు ఎందుకో తెలుసా? ఇటీవల ప్రారంభమైన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై ప్రాణాలు కోల్పోవద్దని! ఎందుకంటే… ఈ ఫ్లై ఓవర్ నుంచి చూస్తే ఐటీ కారిడార్ అత్యంత విలాసవంతమైన భవనాలు, లైట్లతో జిగేల్ మంటూ విరజిమ్ముతున్న వెలుతురు విదేశీ లొకేషన్ను తలపిస్తున్నది. దీంతో వాహనదారులే కాదు ఫొటోల కోసం పాదచారులు కూడా ఆసక్తి చూపుతు ఫ్లెఓవర్ పైకి ఎక్కి ప్రమాదకరమైన స్థాయిలో సెల్ఫీలు దిగుతూ కలవరం రేపుతున్నారు.
ఈ నెల 10న వొడాఫోన్ సంస్థలో సేల్స్మెన్లుగా పనిచేస్తున్న సాయి వంశీరాజ్, ప్రవీణ్కుమార్ అర్ధరాత్రి సమయంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై నిల్చుని సెల్ఫీలు దిగుతున్నారు. ఇదే సమయంలో రాయదుర్గం నుంచి హైటెక్సిటీ మార్గంలో కాగ్నిజెంట్ ఉద్యోగి అభిలాష్ తన కారులో వేగంగా దూసుకువచ్చాడు. మూలు మలుపు వద్ద సెల్ఫీలు దిగుతున్న వారిని గమనించకుండా వారిపై నుంచి దూసుకువెళ్లాడు. అంతే సెల్ఫీలు దిగుతున్న వంశీరాజ్, ప్రవీణ్కుమార్ ఫ్లైఓవర్ మీద నుంచి ఎగిరి కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. అంతేకాకుండా ముందున్న వాహనాలను సైతం కారు ఢీ కొట్టడంతో సాయికృష్ణ, పవన్కుమార్, మురళీకృష్ణ, గిరిధర్లు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనను విశ్లేషించిన పోలీసులు సెల్ఫీ ఒక కారణం కాగా, మద్యం మత్తులో నిర్లక్ష్యపు డ్రైవింగ్ మరో కారణంగా నిర్ధారించారు. అయితే ఫ్లైఓవర్పై సెల్ఫీ దిగడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టంచేస్తోంది.
ఈ నేపథ్యంలో… బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద 24/7 ఈ ఫ్లైఓవర్పై రాకపోకలను పోలీసులు గమనించనున్నారు. ప్రారంభమైనప్పటి నుంచి ఈ రహదారిపై వాహనాల రాకపోకలను గమనించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మొత్తం 3 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేశారు. దీంతో ఈ ఫ్లైఓవర్పై సాగుతున్న రాకపోకలను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సెల్ఫీల గోల మొదలు కావడంతో ట్రాఫిక్ పోలీసులు వారిని అప్రమత్తం చేసేందుకు పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టంను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో దీనిని ప్రారంభించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సిస్టం ప్రారంభం కాగానే సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించే కమాండ్ కంట్రోల్ సిబ్బంది మైక్ ద్వారా అనౌన్స్ చేస్తూ అక్కడ సెల్ఫీలు దిగవద్దని హెచ్చరిస్తుంది.