టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు మరోసారి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. 2020లో జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు స్విజర్లాండ్లోని దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 50వ సదస్సుకు కేటీఆర్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్జ్ బ్రెండే ఆహ్వానం పంపించారు. గత 50 సంవత్సరాలుగా ప్రపంచంలోని ప్రైవేటు వ్యాపార, వాణిజ్య రంగంలోని ప్రముఖ సంస్థలతో ప్రభుత్వ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కీలకపాత్ర పోషిస్తుందని, ఈసారి జరగనున్న సమావేశానికి సైతం ప్రపంచంలోని కీలక సంస్థల ప్రతినిధులతో పాటు, ప్రభుత్వాధినేతలు, కేంద్ర స్ధాయి మంత్రులను ఆహ్వనిస్తున్నట్లు అధ్యక్షుడు బోర్జ్, మంత్రి కేటీఆర్కు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అనేక వినూత్న కార్యక్రమాలు, పథకాలతో ముందుకు వెళుతుందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో అగ్రభాగాన ఉన్నదని తెలిపారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో మంత్రి కేటీఆర్ నాయకత్వంలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షించాయని, ఈ నేపథ్యంలో ‘నాలుగవ పారిశ్రామిక విప్లవంలో టెక్నాలజీ ప్రయోజనాలు ఎదురయ్యే సవాళ్లను తగ్గించడం’ అనే అంశంపైన చర్చించాల్సిదిగా మంత్రి కేటీఆర్ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోరింది. దీంతోపాటు వివిధ అంశాలపైన జరిగే చర్చల్లోనూ తెలంగాణ ప్రభుత్వ అనుభవాలను వివరించాల్సిందిగా మంత్రికి పంపిన లేఖలో విజ్ఞప్తి చేసింది. డబ్ల్యూఈఎఫ్ సమావేశాలకు ఆహ్వానంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన గతంలోనూ ఇలాంటి సమావేశంలో పాల్గొన్నారు.
