గ్రూప్ – 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ రిజల్ట్స్ను శుక్రవారం నాడు ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమ్స్, ప్రిలిమ్స్ పేపర్–1, పేపర్–2 ఫైనల్ కీని కూడా ప్రకటించింది. మొత్తం 167 పోస్టుల భర్తీకి మే 26న ప్రిలిమ్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ అందులో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది(1:50) చొప్పున మొత్తం 8,350 మందిని మెయిన్స్కు ఎంపిక చేసింది. కాగా గతంలో జీవో 5 ప్రకారం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు 1:12 చొప్పున ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. ఏపీపీఎస్సీ నిర్ణయంపై అభ్యర్థులు అభ్యంతరం చెబుతూ 1:50 చొప్పున మెయిన్స్కు ఎంపిక చేయాలని విన్నవించినా గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభ్యర్థుల విన్నపం పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. 1:50 చొప్పునే అభ్యర్థుల్ని మెయిన్స్కు ఎంపిక చేయాలని, తద్వారా పరీక్షల నిర్వహణకు అదనంగా అయ్యే ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే సర్దు బాటు చేస్తుందని ప్రభుత్వం ఏపీపీఎస్సీకి స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మెయిన్స్ ఎంపికకు కటాఫ్గా 90.42 మార్కులను నిర్దేశించిన ఏపీపీఎస్సీ మొత్తం 8,350 మందిని మెయిన్స్కు ఎంపిక చేసింది. గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫైనల్కీని కూడా తన వెబ్సైట్లో పొందుపరిచింది. కాగా గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి 23వ తేదీ వరకు ఏడు సెషన్లలో ఆఫ్లైన్లో నిర్వహిస్తారు. మొత్తంగా తాము కోరుకున్నట్లు 1:50 శాతంలో మెయిన్స్కు ఎంపిక చేయడం పట్ల గ్రూప్ – 1 అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
