ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రాగల 24గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, దక్షిణ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. కేరళ, మాల్దీవులు, మన్నూ ప్రాంతాల్లోని అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణకేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని వాతావరణకేంద్రం అధికారులు కోరారు.
