హైదరాబాద్లో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్మాన్ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. అమెరికన్ కాన్సులేట్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి జగన్ను తొలిసారి కలుసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సమయంలో రిఫ్మాన్ సీఎం వైఎస్ జగన్తో సమావేశమయ్యారు. గ్రామ సచివాలయాలతో పాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. అవినీతి రహిత, పారదర్శక, సుపరిపాలనలో భాగంగా తీసుకొచ్చిన విధానాల గురించి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆమేరకు తగిన కృషి చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పాలనా సంస్కరణలపై రిఫ్మాన్ ప్రశంసలు కురిపించారు.
