ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిననాటి నుంచి కొత్త కొత్త పథకాలతో దూకుడు చూపిస్తూనే ఉన్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్. రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఇక త్వరలోనే మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.. నవంబర్ 14వ తేదీన ‘నాడు- నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వచ్చే నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. ప్రతీ ఏడాది రూ.1500 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ. 6 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇక, ప్రైవేటు కాంట్రాక్టర్లతో కాకుండా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిని దేశంలోనే తొలిసారి అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. అంటే.. ప్రజల భాగస్వామ్యంతో ప్రతీ స్కూల్ ఆధునీకరించనున్నారు.. నేడు స్కూల్ ఎలా ఉంది.. నాలుగేళ్ల తర్వాత ఎలా ఉంటుందోనని ఫోటోలతో ప్రజల ముందుంచాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకే కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిని అవలంభించాలనే నిర్ణయానికి వచ్చారు.
