అల్లుడు రెండో పెళ్లి చేసుకుని తన కూతురి జీవితాన్ని నాశనం చేశాడన్న మనస్తాపంతో అత్త పోలీస్స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన అనంతపురం జిల్లా కదిరి లో జరిగింది. పట్టణంలోని అడపాలవీధిలో ఉంటున్న గంగాధర్, సుజాత దంపతుల కుమార్తె శైలజను కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చెంచోళ్లపల్లికి చెందిన శ్రీనివాసులుకు ఇచ్చి గత ఏడాది డిసెంబరులో వివాహం చేశారు. రెండు నెలల పాటు భార్యతో సక్రమంగా కాపురం చేసిన శ్రీనివాసులు తర్వాతి నుంచి ఆమెను వేధించడం ప్రారంభించాడు. దీంతో శైలజ తల్లిదండ్రులు అల్లుడి తీరుపై పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టారు. ఈ క్రమంలోనే శ్రీనివాసులుకు పెళ్లికి ముందే ఓ మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో భార్యను వేధిస్తున్నాడని తేలింది. దీంతో అల్లుడిపై శైలజ తల్లిదండ్రులు కదిరి పోలీసులకు అప్పట్లోనే ఫిర్యాదు చేశారు. నెల రోజుల క్రితం శ్రీనివాసులు తన ప్రియురాలిని గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో శైలజ తల్లి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీనివాసులు తన కూతురికి తీరని అన్యాయం చేశాడని, ప్రస్తుతం 8నెలల గర్భవతిగా ఉన్న శైలజ భవిష్యత్ ఏంటో తెలియడం లేదని, తమకు న్యాయం చేశాలని ఆమె పోలీసులను వేడుకుంది. పోలీసుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో శనివారం స్టేషన్ ఎదుటే పరుగుల మందు తాగింది. పోలీసులు, కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీనివాసులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
