తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లి దండ్రులకు టీటీడీ సంతృప్తికర ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబరు 15, 29వ తేదీల్లో మంగళవారం వయోవృద్ధులు(65 సం. పైబడిన), దివ్యాంగులకు 4వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10గంటల స్లాట్కు వెయ్యి, మధ్యాహ్నం 2గంటలకు 2వేల టోకెన్లు, 3గంటల స్లాట్కు 1000టోకెన్లు జారీచేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ కోరుతోంది. అలాగే ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు ఇస్తున్నారు. ఉదయం 7గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు.
కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామి దర్శనం కల్పిస్తారు. 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను అక్టోబరు 16, 30వ తేదీల్లో బుధవారం ఉదయం 9నుండి మధ్యాహ్నం 1.30గంటల వరకు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణరోజుల్లో సంవత్సరం లోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరికమేరకు ఐదేళ్లలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను రెండురోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు అంశాలపై దృష్టి సారిస్తున్నారు.. అనేక సంస్కరణలు చేపడుతున్నారు.