తెలంగాణేర్పడిన తర్వాత పచ్చదనాన్ని,అటవీ అభివృద్ధికై హరితహారం లాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అటవీ పర్యావరణ,న్యాయ ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అడవుల అభివృద్ధి,పచ్చదనం పెంపు లాంటి పలు అంశాలకై సర్కారు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కొత్తగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (Forest College and Research Institute, Telangana) త్వరలోనే అందుబాటులోకి రానుంది.
ఫారెస్ట్ కాలేజీ కోసం కొత్తగా రూపొందించిన వెబ్ సైట్ (http://www.fcrits.in/) ను మంత్రి ఆవిష్కరిస్తూ తెలిపారు. ఇంకా మంత్రి మాట్లాడుతూ”అధునీక సాంకేతిక పద్ధతుల్లో నాణ్యమైన, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించి అటవీ యాజమాన్యంలో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివారు ములుగుకు సమీపంలో రూ.75 కోట్లతో నిర్మించిన కొత్త క్యాంపస్ సిద్దమైందని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, సెంట్రల్ లైబ్రరీ, జియోమెట్రిక్ ల్యాబ్స్, వేర్వేరుగా బాయ్స్ అండ్ గర్ల్ హస్టల్స్, మెస్ బ్లాక్, స్టాఫ్ క్వార్టర్స్ తో పాటు ఇతర సదుపాయాలను ఇందులో కల్పిస్తున్నామన్నారు.
2016లో ప్రారంభమైన బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ క్యాంపస్లో నాలుగో బ్యాచ్ కొనసాగుతోందని, కళాశాలలో నిపుణలైన ప్రొఫెసర్లు విద్యాబోధన చేస్తున్నారని, వచ్చే ఏడాది (2020) నుంచి ఫారెస్ట్రీలో ఎమ్మెస్సీ, 2022 నుంచి పీహెచ్డీ ఫారెస్ట్రీ కోర్సులను ప్రవేశపెడతామని కాలేజీ డీన్ డాక్టర్ జీ. చంద్రశేఖర రెడ్డి తెలిపారు. మరోవైపు కొత్త క్యాంపస్ అవసరాలు, పరిశోధనలు, ఫారెస్ట్ రీసెర్చ్, నర్సరీలు, వుడ్ వర్కషాపు తదితరాల ఏర్పాటుకు వీలుగా ములుగు రీసెర్చ్ సెంటర్ ఆధీనంలో ఉన్న 130 ఎకరాల భూమిని ఫారెస్ట్ కాలేజీకి బదలాయిస్తూ అధికారులు మంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు.