బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన అత్తమామలు తనపై వేధింపులకు పాల్పడ్డారనిచ ఆడపడుచు మిసా భారతి కూడా తీవ్రంగా గృహహింసకు పాల్పడ్డారని వెల్లడించారు. తనకు తిండికూడా పెట్టకుండా వేధించడంతోపాటు చివరకు తన సంసార జీవితాన్ని నాశనం చేశారని ఆమె మీడియాతో చెప్పారు. భర్త తేజ్ ప్రతాప్, మరిది తేజస్వి ప్రతాప్ యాదవ్ మధ్య విబేధాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఐశ్వర్య పేర్కొన్నారు. ఐశ్వర్య అత్త రబ్రీదేవి తన కుమార్తెపట్ల అనుచితంగా ప్రవర్తించారని ఐశ్వర్య తండ్రి ఆర్జేడీ ఎమ్మెల్యే అయిన చంద్రికారాయ్ ఆరోపించారు.
తన కుమార్తె కు అత్తగారింట్లో హక్కులు పొందాలని కోరుకుంటున్నామని, దీనపై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆమె భర్త మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించారు. కొన్నిరోజులుగా తాను ఢిల్లీలో ఉంటున్నానని ఆమెను ఎలా వేధించగలనని ప్రశ్నించారు. ఐశ్యర్య ఆరోపణలు నిరాధారమైనవని, తల్లిదండ్రుల ఆదేశాల మేరకే ఇదంతా చేస్తోందని చెప్పారు. 2018, మేలో వైభవంగా ఐశ్వర్య, తేజ్ ప్రతాప్ వివాహం జరిగింది. అయితే కొద్దినెలలకే వీరిద్దరి మధ్య కలతలు వచ్చాయి. తనభర్త తేజ్ ప్రతాప్ డ్రగ్స్కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్వర్య గృహహింస నుంచి తనను కాపాడాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే తేజ్ ప్రతాప్ గతేడాది నవంబర్ లోనే విడాకుల కోసం దాఖలు చేసారు.