ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అన్ని గుర్తింపు కార్డుల స్థానంలో దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క గుర్తింపు కార్డు ఉండాల్సిన అవసరముందని దేశ హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. సమాచారం అంతటినీ డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చేందుకు 2021 లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణకు మొబైల్ యాప్ను వాడనున్నట్లు షా ప్రకటించారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, జనగణన కమిషనర్ కార్యాలయ నిర్మాణాలకి సోమవారం అమిత్ షా శంకుస్థాపన చేసారు. 2021 జనాభా లెక్కల సేకరణకు మొట్టమొదటిసారి మొబైల్ ఫోన్ అప్లికేషన్ను ఉపయోగించనున్నామని ఇదో విప్లవాత్మకమైన మార్పు కానుందన్నారు.
అన్ని వివరాలను ఒకేకార్డులో నిక్షిప్తం చేసేందుకు ఇది సాయపడుతుందని, దేశ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు, సంక్షేమ పథకాలకు 2021 జనాభాలెక్కలే ప్రాతిపదికగా మారనున్నాయని తెలిపారు. దేశప్రజలంతా స్వచ్ఛందంగా ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మనదేశంలోని 130కోట్లమంది జనాభా లెక్కల సేకరణ వల్ల కలిగే లాభాలను వివరించాలని, ప్రభుత్వ పథకాలకు ఈ జాబితా, వివరాలను ఎలా ఉపయోగకరమో తెలియజేయాలన్నారు. ఈసమాచారం దేశ పురోగతిలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. 2011జనగణన ఆధారంగా కేంద్రం చేపట్టిన 22సంక్షేమ పథకాల్లో ఉజ్వల, బేటీ బచావో బేటీ పడావో పధకాలు విజయవంతంగా అమలవుతున్నాయని షా అన్నారు. జనాభా లెక్కలను నిజాయతీతో నిర్వహించి అధికారులు పుణ్యం కట్టుకోవాలని, జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని అమిత్ షా అధికారులను కోరారు.