మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం “సైరా”. అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన సైరా టీజర్ సంచలనం రేపుతోంది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రంపై భారీ ఎక్స్ప్టెక్టేషన్స్ పెరిగిపోయాయి. బ్రిటీష్ వారిపై పోరాడిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిపై రూపొందించిన చిత్రమే. సైరా. ఈ చిత్రానికి మెగాపవర్స్టార్ రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రిలీజ్ సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ఆదివారం నాడు ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ చిత్రానికి ముఖ్యఅతిధులుగా పవర్స్టార్ పవన్ కల్యాణ్, రాజమౌళి, కొరటాల శివ, వివివినాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరు రాజమౌళిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. చిరు మాట్లాడుతూ.. సైరా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న ఈ సెప్టెంబర్ 22 తన జీవితంలో ల్యాండ్ మార్క్ అని చెప్పారు. . 1978 ఇదే రోజు నా తొలి సినిమా ప్రాణం ఖరీదు రిలీజైంది. ఆ రోజున నా తొలి సినిమా ప్రజల ముందుకు పోతోంది. ప్రజలు నన్నేమనుకుంటారు.. నా ఫ్యూచర్ ఏంటి? అనే మీమాంసలో ఉన్నాను. ఈ రోజు మళ్ళీ అలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయనేది వాస్తవం అని చిరు చెప్పారు..తాను ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిపోయేలా భగత్సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర చేయాలని అనుకున్నానని కాని, కానీ పరుచూరి సలహా మేరకు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమా చేశానని చెప్పారు. నిజానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురించి తనకు తెలియదని, కానీ చరిత్రలో కనుమరుగైన ఆ యోధుడి కథను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే సైరా మూవీ చేశామని అన్నారు. తనకు ఈ కథను పరుచూరి వారు 20 ఏళ్ళ క్రిందటే వినిపించారని, కానీ బడ్జెట్ సపోర్ట్ లేక, సరైన నిర్మాత రాక ఇన్ని రోజులు సినిమా తీయలేకపోయామని చిరు అన్నారు. అయితే ఈ రోజున మళ్ళీ ఈ సినిమా చేయాలనే ఆలోచనకు ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేసింది దర్శకుడు రాజమౌళి అని చెప్పారు చిరంజీవి. తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళి ‘బాహుబలి’. మనమంతా తెలుగువాళ్లం అని గర్వంగా చెప్పుకుంటూ కాలర్ ఎగరేసేలా గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈరోజు ‘సైరా’ సినిమా కూడా అంత గౌరవాన్ని తెస్తుందనే ప్రగాఢ విశ్వాసం, నమ్మకం నాకుంది. నేను మాట్లాడేది గౌరవాన్ని గురించే.. విజయాన్ని గురించి ఇంకో సినిమాతో పోల్చట్లేదు.. ఇది గమనించాలి. రాజమౌళి గనక బాహుబలి తీసుండకపోతే ఈ రోజు సైరా నరసింహా రెడ్డి వచ్చి ఉండేది కాదు హ్యాట్సాఫ్ టూ రాజమౌళి అని సభాముఖంగా చెప్పారు చిరు. మొత్తంగా సైరా ప్రీరిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరు డైరెక్టర్ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేయడం టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది.
