ఏపీలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలేవీ టీడీపీకి, పచ్చ పత్రికలకు కనపడలేదు, కనపడవు కూడా. పనిగట్టుకుని మరీ లోపాల్ని వెదికేందుకు విశ్వప్రయత్నం చేస్తూ బొక్కబోర్లా పడుతున్నారు ఆ పార్టీ నేతలు.తాజాగా ఇదే లిస్ట్ లోకి పవన్ కల్యాణ్ కూడా చేరారు. రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ పై విరుచుకుపడ్డాడు. జగన్ తీసుకున్న నిర్ణయాలతో లబ్ధిపొందుతున్న వర్గాలు సంతోషంగా ఉంటే.. పవన్ కి మాత్రం ఆ సంతోషం కనపడ్డంలేదు. పవన్ కి అర్థంకాని విషయం, ఆయన అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే.. సీఎం జగన్ కమిటీలతో కాలయాపన చేసేరకం కాదు. ఆర్టీసీ విలీనంపై కూడా జగన్ కమిటీ వేశారు. ఏమైంది? రోజుల వ్యవధిలోనే కమిటీ నివేదిక ఇచ్చింది. విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో సంతోషం వెల్లివిరిసింది. ఇప్పుడు సీపీఎస్ రద్దుకు కమిటీ అంటున్నారు. జగన్ మాటిస్తే ఫలితం ఎలా ఉంటుందో.. ఆయా ఉద్యోగులకు బాగాతెలుసు. అందుకే వారంతా సైలెంట్ గానే ఉన్నారు, పవన్ కల్యాణ్ మాత్రమే నోరు చేసుకుంటున్నారు. ఆర్టీసీ విలీనంపై నోరు మెదపని పవన్ కల్యాణ్ ఇప్పుడు సీపీఎస్ రద్దు కమిటీపై ఎలా కామెంట్ చేస్తారని సోషల్ మీడియలో వైసీపీ అభిమానులు తెగ హల్ చల్ చేస్తున్నారు.
