డిసెంబర్ నెలలో మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్య నారాయణ అన్నారు. గురువారం మున్పిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించిన సందర్భంగా బొత్స మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలను ప్రజలవద్దకు తీసుకెళ్లేందుకుచ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గతంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకేసారి నాలుగులక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదని, జగన్ అధికారంలోకి వచ్చినవెంటనే లక్షలాది ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తున్నారంటూ గుర్తుచేశారు.
సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు ముందుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చాలామంది అధికారులు ప్రజలు ఫోన్లు చేస్తే ఎత్తట్లేదని, స్పందన కార్యక్రమంపై అధికారులు రాజీపడడానికి వీల్లేదని అన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రంలో డ్రైనేజీ వ్యవస్థ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. పట్టణాల్లో నీటికొరత రాకుండా చూడాల్సిన అవసరముందన్నారు. వచ్చే ఉగాదికల్లా అర్హులందరికీ ఇళ్ల పట్టాలివ్వాలని సీఎం జగన్ నిర్ణయించినందుకే ఈ కార్యక్రమంకోసం వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ అధికారుల సేవలను మున్సిపల్ అధికారులు వినియోగించుకోవాలని కోరారు. చాలామంది కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటుచేయమని అడుగుతున్నారన్నారు. ఈ విషయంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు.