నీ నీచ రాజకీయం కోసం పల్నాడును వాడుకోవద్దంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిలు చంద్రబాబుకు సూచించారు. అల్లకల్లోలం సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. గత ఐదు సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు ఏనాడైనా పల్నాడు వెళ్లాడా.? ప్రజల యోగక్షేమాలు విచారించారా..? అని ప్రశ్నించారు. అలా చేసిఉంటే ముఠా కక్షలు ఎప్పుడూ ఉండేవి కాదన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత వర్షాలు పడడంతో రైతులు, రైతు కూలీలు, పేదలు ఎక్కువ ఉన్న పల్నాడులో ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారని, కేవలం యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాద్ అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే చంద్రబాబు నాటకాలాడుతున్నారన్నారు.
ఆత్మకూరులో అసలు ఏం గొడవ జరిగింది. ఎప్పుడు జరిగింది. ఎందుకు జరిగింది.. ఎంతమంది శిబిరంలో ఉన్నారని చూస్తే వచ్చినవారిలో అందరూ పెయిడ్ ఆర్టిస్టులే ఉన్నారన్నారు. చంద్రబాబు శిబిరంలో 30మంది ఉన్నవారు తెల్లవారే సరికి 200 మంది ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. పల్నాడు ఫ్యాక్షన్ ఏరియా ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రెండుకుటుంబాల మధ్య జరిగిన గొడవను పార్టీలకు అంటగట్టి కావాలనే గందరగోళం సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏమాత్రం ఇంగింతం ఉంటే నీరాజకీయం కోసం మా ప్రాంతంలో అల్లకల్లోలం చేయొద్దని వారు కోరుతున్నారు.