ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. నేటి టెక్నాలజీ యుగంలో కూడా క్యాన్సర్ రోగం నుంచి బయటపడిన వారి శాతం చాలా తక్కువ అనే చెప్పాలి…ఇప్పటికీ మెజారిటీ శాతం కేన్సర్తో మరణిస్తూనే ఉన్నారు. అయితే కేన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే…ఆహారంలో చేపలను భాగంగా చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
తాజాగా వారానికి మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) సంయుక్తంగా చేపట్టిన ఓ పరిశోధనలో తేలింది. వారానికి ఒకసారి చేపను తినేవారితో పోలిస్తే మూడు సార్లు తీసుకునేవారిలో పేగు క్యాన్సర్ ముప్పు 12 శాతం తక్కువగా ఉందని ఈ పరిశోధన వెల్లడించింది. అన్ని రకాల చేపలను తీసుకోవడం మంచిదే అయినా నూనె అధికంగా ఉండే సాల్మన్, మాకరెల్ చేపల కంటే ఇతర చేపలు మరింతగా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని సదరు అధ్యయనం తెలుపుతోంది. చేపల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపును తగ్గిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. శరీరంలో వాపు ప్రక్రియ డీఎన్ఏను ధ్వంసం చేయడం ద్వారా క్యాన్సర్కు దారితీస్తుందని సంగతి తెలిసిందే..తరచూ చేపలను తినేవారిలో క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గినట్టు వెల్లడైందని, ఆరోగ్యకర ఆహారంలో చేపలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ మార్క్ గుంటర్ అన్నారు. ప్రజలు పొగతాగడం మాని బరువును తగ్గించుకుని ఆరోగ్యకర ఆహారం తీసుకుంటే క్యాన్సర్ కేసులను 40 శాతం వరకూ నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సో..చూశారుగా వారానికి మూడు సార్లు చేపలు తినండి..క్యాన్సర్ ముప్పు రాకుండా జాగ్రత్తపడండి..ఓకేనా..!
