తెలంగాణలోని 46 వేల చెరువులను పునరుద్ధరించి, 20 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ మొదలుపెట్టింది. చిన్నతరహా నీటివనరులను బలోపేతం చేయడం, నీటి యాజమాన్య పద్ధతులను ప్రోత్సహించడం, చెరువులను పునరుద్ధరించడం, కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో చిన్నతరహా సాగునీటి రంగానికి కేటాయించిన 255 టీఎంసీలను సమర్థంగా ఉపయోగించుకోవడమే దీని ప్రధాన లక్ష్యం.
2018 మార్చినాటికి 22,500 చెరువులు పునరుద్ధరించారు. దీనివల్ల చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. పంటలపై తేమ శాతం వృద్ధి చెందింది. నీతి అయోగ్కు అందిన నివేదిక ప్రకారం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల కింద సాగునీరు అందే భూముల పరిధి 51.5 శాతం పెరిగింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం అద్భుతంగా ఉందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో జలవనరుల పునరుద్ధరణ గొప్పగా జరిగిందని.. ఈ విషయంలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని శుక్రవారం విడుదల చేసిన ‘సమగ్ర నీటి యాజమాన్య సూచిక’ నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు జలవనరుల నిర్వహణ, తాగు, సాగునీరు అందించడంలో చూపుతున్న ప్రతిభను ఆధారంగా చేసుకొని నీతి ఆయోగ్ మూడేళ్లుగా నివేదికలు విడుదల చేస్తోంది. 2019 సంవత్సరానికి చెందిన నివేదికను కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్కుమార్, సీఈఓ అమితాబ్కాంత్లు విడుదల చేశారు.
ఇందులో తెలంగాణలో జరిగిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దానివల్ల చెరువుల కింద 51.5% మేర సాగు పెరిగినట్లు పేర్కొన్నారు.
నివేదికలోని ముఖ్యాంశాలు..
* నీటివనరుల పునరుద్ధరణలో తెలంగాణ దేశంలో తొలిస్థానంలో నిలిచింది.
* మూడేళ్లలో సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకున్న తొలి రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.
* 2015-16లో తొలి నివేదిక విడుదల చేసే సమయానికి తెలంగాణ కనిష్ఠ పనితీరు కనబరిచిన రాష్ట్రాల జాబితాలో ఉన్నప్పటికీ ఈ మూడేళ్లలో అది 50 పాయింట్లను దాటింది.
* జలవనరుల కింద సాగునీటి యోగ్యతను 100 శాతం పునరుద్ధరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 60 శాతం గ్రామీణ ప్రాంతాలకే తాగునీరు అందుతున్నప్పటికీ నీటినాణ్యత సమస్యలను 100 శాతం పరిష్కరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎదురవుతున్న నీటి నాణ్యత సమస్యలను తగ్గించడంలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో నిలిచింది.
* ప్రస్తుతం పట్టణప్రాంతాల్లో 80% ఇళ్లకు తాగునీరు అందుబాటులోకి వచ్చింది. అందులో 75% మంది నుంచి రుసుములు కూడా వసూలు చేస్తున్నారు.
* మధ్యతరహా సాగునీటి వనరులను అంచనా వేయడానికి ప్రభుత్వం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా అధ్యయనం చేయించి ఆ వివరాలను భువన్ వెబ్పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచింది.
* సమగ్ర నీటి వినియోగంలో 50 పాయింట్లతో దేశంలో పదో స్థానంలో నిలిచింది.
Post Views: 262