గుంటూరు జిల్లాలోని గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. చట్టాలను తమ చుట్టాలుగా భావిస్తూ తప్పుల మీద తప్పుల చేస్తూ పోయిన పచ్చపార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయని అందరూ అంటున్నారు. అక్రమ మైనింగ్పై 2015లో హైకోర్టును ఆశ్రయించినందుకుగాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అప్పటి సీఐ హనుమంతరావు, ఎస్సై, కానిస్టేబుళ్లు, అప్పటి ఆర్డీవో, మైనింగ్ ఏడీలు తనను వేధింపులకు గురిచేసి, చంపాలని చూశారని వైసీపీ నాయకుడు కుందుర్తి గురువాచారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు యరపతినేని సహా 12 మందిపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
యరపతినేని, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు వ్యతిరేకంగా అక్రమ మైనింగ్పై హైకోర్టులో పిల్ (ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం) వేసిన కోపంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు, రౌడీలు, సీఐ హనుమంతరావు, ఎస్సై, కానిస్టేబుళ్లతో మానసికంగా, శారీరకంగా వేధించి చంపేందుకు యత్నించారని గురువాచారి ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో యరపతినేని సహా 12మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. 2016లో గురువాచారిని వేధింపులకు గురిచేసిన ఘటనపై ఇటీవల కేసు నమోదు కావడంతో మైనింగ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పల్నాడు ప్రాంతంలో గత ఐదేళ్లలో జరిగిన అక్రమ మైనింగ్కు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి అరెస్ట్ భయం పట్టుకుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. అక్రమ మైనింగ్ కేసులో సీబీసీఐడీ అధికారులు తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలని ఇప్పటికే యరపతినేని శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై మరో కేసు నమోదవడంపై యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన చెందుతున్నారని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు.