ఆర్టికల్ 370 రద్దుతో తెలంగాణలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే హైదరాబాద్లో భద్రత కట్టుదిట్టం చేశారు. తాజా పరిస్ధితిని సమీక్షిస్తున్నామని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై డీజీపీ జితేందర్ తెలిపారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరించేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని డీజీపీ స్పష్టంచేశారు. అలాగే సైబరాబాద్లోనూ హైఅలర్ట్ ప్రకటించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. కమీషనరేట్ పరిధి 144 సెక్షన్ అమల్లో ఉందని, ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతిలేదని స్పష్టంచేశారు. అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశామని వెల్లడించారు. అలాగే రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోనూ అలర్ట్ ప్రకటించారు. ఎటువంటి అవాంచనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు.
