కోలీవుడ్ స్టార్, నడిగర్ సంగం అధ్యక్షుడు విశాల్కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. చెన్నై వడపళనిలో ఉన్న విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ ఆఫీస్లో ఐదేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ఇచ్చిన జీతాల్లో మినహాయించిన పన్నును (టీడీఎస్ను) సక్రమంగా ఐటీ శాఖ అధికారులకు చెల్లించలేదని, దానికి వివరణ ఇవ్వాలంటూ విశాల్కు గతంలో అధికారులు నోటీసులు జారీచేశారు. దానికి సమాధానం ఇవ్వకపోవడంతో విశాల్పై చర్యలు చేపట్టాలంటూ ఎగ్మూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు ఆగస్టు 2న విశాల్ విచారణకు హాజరై వివరణ ఇవ్వాలంటూ విశాల్ను ఆదేశిస్తూ సమన్లు పంపింది. కానీ శుక్రవారం విశాల్ హాజరు కాలేదు. ఐటీ అధికారులు పంపిన నోటీసు విశాల్కు అందలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నేరుగా హాజరుకావడం నుంచి విశాల్కు మినహాయింపు కల్పించాలని కోరారు. దీనిని ఐటీ శాఖ తరపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత విశాల్కు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ను న్యాయమూర్తి జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. విశాల్కు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే..నడిగర్ సంఘం అధ్యక్షుడిగా తీవ్ర విబేధాలు ఎదుర్కొంటున్న విశాల్కు తాజాగా కోర్ట్ జారీ చేసిన నాన్బెయిలబుల్ వారెంట్ ఇబ్బందికరంగా మారింది. మరి ఈ కేసులో విశాల్ అరెస్ట్ అయి, కోర్టుకు హాజరవుతాడో లేదో చూడాలి.
