జమ్ము కశ్మీర్లో నెలకొన్న ప్రస్థుత పరిస్థితుల దృష్ట్యా శ్రీనగర్ ఎన్ఐటీ క్యాంపస్ను విద్యార్థులు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో ఎటూ పాలుపోలేని పరిస్థితుల్లో భయాందోళనలకు గురైన విద్యార్థులు తమ గోడును ట్విట్టర్ ద్వారా టీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తమ విద్యాసంస్థను మూసివేస్తుండటంతో తమను ఆదుకోవాలని ఏ సందర్భంగా కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. దీనితో వెంటనే స్పందించిన కేటీఆర్ ఈ విషయంలో విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి భరోసా కల్పించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహాయం కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరీని సంప్రదించాలని కోరారు. అక్కడి కార్యాలయానికి సంబంధించిన ఫోన్ నంబర్లు 011-2338 2041 లేదా +91 99682 99337 ట్విటర్లో పోస్ట్ చేశారు.
విద్యార్థులను క్షేమంగా రాష్ట్రానికి రప్పించడానికి ఢిల్లీ రెసిడెంట్ కమీషనర్ శ్రీ వేదాంతం గిరి తో మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషీతో మాట్లాడటం జరిగింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేమముగా రాష్ట్రానికి తీసుకురావటానికి తగు ఏర్పాట్లు చేయవలసిందిగా ఈ సందర్భంగా వారిని కోరటం జరిగింది. వెంటనే స్పందించిన తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ ఢిల్లీలోని రెసిడెంట్ కమీషనర్ తో సమన్వయం చేసుకొని విద్యార్థులను రప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీలోని రెసిడెంట్ కమీషనర్ జమ్మూ కాశ్మీర్ భవన్ అధికారులతో మాట్లాడటం జరిగింది. అక్కడినుండి విద్యార్థులతో నేరుగా టచ్ లో ఉన్న కమీషనర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ విద్యార్థులకు అవసరమైన సహకారాన్ని అందించడం జరిగింది. జమ్మూ నుండి 130మంది తెలుగు విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో ఢిల్లీకి తరలించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఢిల్లీ చేరుకోగానే అక్కడినుండి విద్యార్థులను హైదరాబాద్ చేరుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ విషయంలో వెంటనే స్పందించిన ప్రభుత్వ అధికారులకు ఢిల్లీలోని రెసిడెంట్ కమీషనర్ గారికి కేటీఆర్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.