కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మంథని మండలం సిరిపురంలో నిర్మించిన సుందిల్ల బరాజ్ సంద్రాన్ని తలపిస్తున్నది. కాసిపేటలోని అన్నారం పంపుహౌస్లో నాలుగు మోటర్లు రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎత్తిపోస్తుండడంతో సోమవారం సాయంత్రానికి బరాజ్లో నీటినిల్వ 5.82 టీఎంసీలకు చేరుకున్నది. దిగువన మేడిగడ్డ బరాజ్లో సోమవారం సాయంత్రం 4 గంటల సమయానికి 4.584 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. అన్నారం బరాజ్లో 7.77 టీఎంసీలుగా నమోదైంది. సుందిల్ల బరాజ్ బ్యాక్వాటర్ గోలివాడ పంప్హౌస్కు ఇప్పటికే చేరగా, తాజాగా మరోసారి ఫోర్బేలోకి వదిలారు. దీంతో గోలివాడ పంపుహౌస్లో మంగళ, బుధవారాల్లో 1వ నంబర్ మోటర్ వెట్న్క్రు ఏర్పాట్లుచేస్తున్నారు. కాళేశ్వరం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, లిఫ్ట్ అడ్వయిజర్ పెంటారెడ్డి అక్కడే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు. సుందిల్లలోకి అనుకున్నంత నీరు చేరుతుండడంతో అన్నారం పంప్హౌస్లోని రెండో నంబర్ మోటర్ను నిలిపివేశారు. పంపులను సిద్ధంచేసే క్రమంలో ఐదో మోటర్ వెట్న్క్రు ఏర్పాట్లుచేస్తున్నారు.
మేడిగడ్డ బరాజ్లో పెరుగుతున్న నీటిమట్టం :
రాష్ట్రంలో పడుతున్న వర్షాలతోపాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న స్వల్ప వర్షాల ప్రభావంతో మేడిగడ్డ బరాజ్లో క్రమంగా నీటి ని ల్వ పెరుగుతున్నది. ప్రాణహిత నుంచి ప్రవా హం పెరుగటంతో పంప్హౌస్లోని 3, 4, 5, 6వ నంబర్ మోటర్ల ద్వారా ప్రాణహిత జలాలను గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బరాజ్కు తరలించారు.ప్రాణహిత ప్రవాహం పెరిగితే మరిన్ని మోటర్లను ఆన్ చేయనున్నారు.
ధర్మపురి వద్ద కొనసాగుతున్న వరద:
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ధర్మపురి వద్ద గోదావరికి వరద పెరుగుతున్నది. దేవాలయ సిబ్బంది, పోలీసులు భక్తులను లోతు ప్రాంతానికి స్నానాలకు వెళ్లకుండా అప్రమ త్తం చేస్తున్నారు. గోదావరి ప్రవాహంలో బ్రహ్మగుండం, సత్యవతి గుండాలు పూర్తిగా మునిగిపోయాయి. శివపంచాయతనంపై నుంచి గోదావరి ప్రవహిస్తున్నది.
దేవాదుల వద్ద గోదావరి ఉరకలు:
ఐదురోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు గోదా వరి ఉప్పొంగుతున్నది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం సమీపంలో దేవాదుల ఇన్టేక్ వెల్ వద్ద నీటిమట్టం సోమవారం సాయంత్రం 77.50 మీటర్లకు చేరుకున్నది. ఛత్తీస్గఢ్ సరిహద్దులను అంటుకుని గోదావరి నిండుగా ప్రవహిస్తున్నప్పటికీ ఒక మోటర్ మోటర్ ద్వారానే నీటిని భీం ఘనపూర్లోని రిజర్వాయర్కు పంప్చేస్తున్నారు. గోదావరి జలాలు వృథాగా పోతున్నాయి. తుపాకులగూడెం బరాజ్ వద్ద కూడా గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఛత్తీస్గఢ్ సరిహద్దువైపు నిర్మాణదశలో ఉన్న పియర్స్ ముంపునకు గురయ్యాయి. రామన్నగూడెం పుష్కరఘాట్ సమీపంలోకి గోదావరి చేరుకుంది. మంగపేట మండలంలోని కమలాపురం ఇన్టేక్వెల్, మంగపేట పుష్కరఘాట్ వరకు గోదావరి ప్రవహిస్తున్నది. వాజేడు మండలంలోని పేరూరు, వాజేడు, పూసూరు బ్రిడ్జి, ఎడ్జర్లపల్లి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతున్నది.
కడెం దూకుడు :
గోదావరి బేసిన్లో ఈసారి ప్రాణహిత నుంచి వరద స్థిరంగా కొనసాగుతున్నది. కన్నెపల్లి వద్ద సుమారు 10-12 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. రెండురోజులు గా కడెం నుంచి వరద భారీగా వస్తున్నది. సోమవారం ఉదయం నుంచి ఇన్ఫ్లో 13వేల క్యూసెక్కులకు పైగా నమోదవుతున్నది. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు(7.603టీఎంసీలు). ప్రస్తుతం 686.200 అడుగులు (4.524 టీఎంసీల) వద్ద ఉన్నది. కడెం నుంచి మంగళవారం సాయంత్రం తర్వాత దిగువకు నీటిని వదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్లంపల్లి జలాశయానికి 3,222 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ఇన్ఫ్లో పెరుగుతుండటంతో కాళేశ్వరం రెండో లింకునకు నీటి లభ్యత మరింత మెరుగువుతుంది. ఇంద్రావతి నుంచి వరద బాగా పెరుగటంతో పేరూరు వద్ద సోమవారం ఉదయానికి ప్రవాహం 69వేల క్యూసెక్కులకు పెరిగింది. దిగువన ధవళేశ్వరం వద్ద అదే సమయానికి ఇన్ఫ్లో 37వేల క్యూసెక్కులకు పైగానే ఉంది. అంటే ఇంద్రావతిలో ప్రవాహం ఇప్పుడిప్పుడే పెరుగుతున్నది.
భద్రాద్రి వద్ద 24 అడుగులకు గోదావరి :
భద్రాద్రి వద్ద గోదావరిలో వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతున్నది. సోమవారం ఉదయం 23.1 అడుగులున్న వరద ప్రవాహం సాయంత్రం ఆరు గంటలకు 24 అడుగులకు చేరింది. మంగళవారం తెల్లవారేసరికి 30 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నదని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేస్తామన్నారు. వరద పెరిగితే ఏజెన్సీ గ్రామాలకు జలగండం పొంచి ఉన్నది. భద్రాచలం కరకట్ట స్లూయిస్లు లీకయ్యే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కిన్నెరసాని రిజర్వాయర్లోకి వరదనీరు:
ఎగువ ప్రాంతాలైన బయ్యారం, గుండాల, ఇల్లెందు మండలాల్లో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నది. రిజర్వాయర్ పూర్తిస్తాయి నీటిమట్టం 407 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 389.4 నీటిమట్టం అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 4 వేల క్యూసెక్కులు ఉన్నది.చర్ల మండల పరిధిలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గుతున్నది. సోమవారం ఉదయం 21 గేట్ల ద్వారా 68,800 క్యూసెక్కులను గోదావరిలోకి విడుదలచేయగా, సాయంత్రానికి వరద ఉధృతి తగ్గడంతో 15 గేట్ల ద్వారా 37,700 క్యూసెక్కులను వదులుతున్నారు.