టీడీపీలో మరో వికెట్ పడింది. ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత . పలువురు సీనియర్ నేతలతోపాటు చోటమోటా నాయకులు తమ రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీకి గుడ్ బై చెప్పి బయటకు వస్తున్నారు. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుంటోంది బీజేపీ.. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోంది. ఈక్రమంలోనే వివిధ పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. ఏపీలో టీడీపీ మరో షాక్ తగిలింది.ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు పోతున్నారు. ఇప్పటికే టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైన విషయం తెలిసిందే.ఇప్పుడు టీడీపీలో మరో కీలక నాయకుడు బీజేపీలో చేరతారని సమచారం. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ పార్టీని బలోపేతం చే సేందుకు బీజేపీ నాయకత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేపట్టింది. వివిధ పార్టీల్లో ఉన్న నాయకులను పార్టీలోకి ఆ హ్వానిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ- కాంగ్రెస్ రాజకీయపక్షాలకు చెందిన అసంతృప్తి నేతలకు వల వేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆ పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీనిలో భాగంగా టీడీపీకి చెందిన పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. గన్నవరంలోని ఆయన ఆధ్వర్యంలో గతంలో నడిచిన టీడీపీ కార్యాలయాన్ని ఇప్పుడు బీజేపీ కార్యాలయంగా మార్చివేశారు. ఇప్పటికే ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో టచ్ లో ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారడం ఖాయం కావడంతో పార్టీ కార్యాలయానికి బీజేపీ రంగులు వేసి ఆ పార్టీ జెండాలతో సిద్ధం చేస్తున్నారు. ఈనెల 24 లేదా 25 తేదీల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమలాపురం పట్టణానికి చెందిన రామ్ మాధవ్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. రామ్ మాధవ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
