మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరుజిల్లా టీడీపీ కార్యాలయంలో కోడెల మాట్లాడారు. జగన్ కు చంద్రబాబు ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని, ప్రజావేదిక కూల్చివేసి ప్రజావ్యతిరేకతను మూటకట్టుకున్నారని కోడెల వ్యాఖ్యానించారు. జగన్ నుంచి ప్రజలు చాలా ఆశించారని, కానీ జగన్ ఏం చేయట్లేదన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించలేకపోయారన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి నిధులను ఆపేశారని కోడెల ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతిలో నిర్మాణ సంస్థలు పనులు ఆపివేయటంతో వేలాది మంది కూలీలకు పని లేదని పేర్కొన్నారు. జగన్ మాట్లాడుతున్న దానికి చేస్తున్న దానికి పొంతనే లేదన్నారు. ఎంతసేపూ జగన్ టీడీపీ నేతలను ఎలా ఇబ్బంది పెట్టాలనే చూస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ వ్యవహారాలు కూడా సరిగా జరగడంలేదని ఆరోపించారు. చంద్రబాబును అవమానించేందుకే అసెంబ్లీ నడుపుతున్నారని కోడెల అన్నారు. తన కుటుంబ సభ్యుల కేసులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకవేళ మా కుటుంబ సభ్యులు నిజంగా తప్పు చేసుంటే విచారణ జరిపాలని కోరారు. అయితే కోడెల వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నారు. గతంలో సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కి ఫిరాయింపులను ప్రోత్సహించారు. అలాగే కోడెల కుటుంబం కే టాక్స్ పేరుతో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలుచేసిందని ఇప్పటికే ఎందరో ఫిర్యాదుచేసారు. కోడెలకుటుంబం వసూళ్లు మాత్రమే కాదు స్కాములు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వాసుపత్రులకు దూదిని, ఇతర మెడికల్ సామాగ్రిని సరఫరా చేసే వ్యవహారంలో కోడెల కుటుంబం భారీస్కామ్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రులకు నాసిరకం దూది, ఇతర మెడికల్ సామాగ్రిని కోడెల కుటుంబం సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. భారీ ధరకు సరకును సరఫరా చేసే కాంట్రాక్టు పొందినట్టు తెలుస్తోంది.
