ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెగ బాధపడిపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారో లేదో కానీ చంద్రబాబు నాయుడుకు మాత్రం ఎన్నో బాధలు కనిపిస్తున్నాయి.నెలలోనే ఇన్ని సమస్యలా అని ఆయన అంటున్నారు.ఆయన ఆస్థాన మీడియాలో ఈ వార్తలకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలలోపే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో వేరుసెనగ విత్తనాల పంపిణీతో పాటు విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం విఫలమైంది. ఆరు నెలల గడువిచ్చి ప్రభుత్వ పనితీరును నిర్మాణాత్మకంగా పరిశీలిద్దామనుకున్నాం.
నేడు ఆ పరిస్థితి లేదు. టిడిపి సానుభూతిపరులైన చౌకదుకాణాల డీలర్లను, మధ్యాహ్నభోజన ఏజెన్సీలను, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలను అడ్డగోలుగా తొలగించేందుకు స్థానిక నాయకులు ఎక్కడికక్కడ దౌర్జన్యాలకు దిగడం ఎంతవరకు సమంజసం? పోలీసులు పార్టీలకతీతంగా పనిచేయాలి. వారు ఇలాగే వ్యవహరిస్తే ఆత్మరక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చంద్రబాబు హెచ్చరించారని వార్తలు వస్తున్నాయి.