తనపై కబ్జా ఆరోపణలు చేసిన కోమటి రెడ్డి వాటిని నిరూపించాలని.. లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు. కోమటి రెడ్డి వ్యాఖ్యలు నిజమని నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఓబీసీ నేత ఎదగడాన్ని ఓర్చుకోలేని కోమటిరెడ్డి.. తనపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడిన రాజు అన్ని అనుమతులు తీసుకునే నా గ్రామం లో ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. కోమటి రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని.. .లేదంటే పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం లోకి కేటీఆర్ని లాగడం కోమటిరెడ్డికి మంచిదికాదన్నారు. కేటీఆర్ నిప్పు రవ్వ అని తెలిపారు. 21 సంవత్సరాల వయసులో తెలంగాణ ఉద్యమం లోకి వచ్చానని తెలిపిన శంభీపూర్ డబ్బుల సంపాదన పరమావధి అయితే తాను అపుడే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లోకి వెళ్లే వాడినని తెలిపారు. తాను ఎక్కడైనా ప్రభుత్వ భూమి గజమైనా ఆక్రమించు కున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్దమేనన్నారు.
