తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం చేసి లేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అంగీకరించారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా వెంకయ్యకు అందించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, దీని ద్వారా ప్రభావితమైన టీడీపీ రాజ్యసభా పక్షానికి చెందిన నలుగురు సభ్యులు బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు వీరంతా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తామంతా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.
అలాగే ముఖ్యంగా సుజనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశం ఆలోచన అందరికీ తెలుసు. మేం జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాం.. ఎన్డీఏ ప్రభుత్వంలో మూడున్నరేళ్లు మోదీ కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం నాకు ఉంది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అన్నిఅంశాలు సాధ్యమైనంత త్వరగా సామరస్యపూర్వకంగా పరిష్కారం కోసం బీజేపీలో చేరుతున్నామన్నారు అయితే సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, కంభంపాటిలపై విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పార్టీలో చేరడానికి ఎవరైనా నాయకులకు పార్టీ ఫండ్ ఇస్తుంది. ఇది బహిరంగ రహస్యమే.. అయితే ఇక్కడ మాత్రం వీరు బీజేపీలో చేరడానికి ఎదురు డబ్బులు ఇచ్చారట.. ముఖ్యంగా చంద్రబాబు ఆదేశాలతో గత ఐదేళ్లుగా ఏపీలో చేసిన అవినీతి కార్యకలాపాల ధనంతోనే వీరు బీజేపీలోకి చేరారట.. భవిష్యత్తులో పార్టీకోసం మరిన్ని సేవలందిస్తామనే హామీ కూడా ఇచ్చారట. వీరిని చేర్చుకుంటే బీజేపీకి కూడా కాంగ్రెస్ కు పట్టిన గతి పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.