ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని నూతన హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా సచివాలయంలోని 2వ బ్లాక్లోని చాంబర్లో ఆమె ఆదివారం బాధ్యతలు చేపట్టి ఉదయం ప్రత్యేక పూజల చేశారు. హోంమంత్రి ఈ సందర్భంగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి కృతజ్ఞతలు తెలిపారు. దళిత మహిళకు హోంమంత్రి బాధ్యత ఇచ్చారన్న ఆమె… మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని…నేరం చేయాలంటేనే భయపడేలా కఠిన చట్టాలు తీసుకు వస్తామని అన్నారు. శాంతి భద్రతలు కాపాడి ప్రజలకు భరోసా కల్పిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ర్యాగింగ్, వేధింపులను సమూలంగా నిర్మూలిస్తామని, మహిళలు నిర్భయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసే పరిస్థితి కల్పిస్తామని సుచరిత తెలిపారు. అలాగే మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పోలీసులకు వీక్లీఆఫ్లు అమలు చేస్తామని, అలాగే 4 బెటాలియన్లు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి చెప్పారు. మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా కానిస్టేబుల్స్ సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని ఆమె భరోసా ఇచ్చారు.
