రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని సీఎం కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో వీటిని ఈనెల 17న సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే ఉండేవి. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మరో 142 కొత్త బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కొత్తగా 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడంతో మొత్తం వీటి సంఖ్య 280కి చేరుకుంది. రాష్ట్రంలోని అన్ని కేటగిరీల కింద మొత్తం రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్య 906 ఉండగా, డిగ్రీ కళాశాలల సంఖ్య 53గా ఉన్నది. మొత్తం ఈ పాఠశాలల్లో 91,680 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, వీరికి 5,335 మంది ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు.
